జీడిమెట్ల, వెలుగు: జల్సాలు చేసేందుకు బైక్ లు చోరీ చేస్తోన్న ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. 17 బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. బాలానగర్ఏసీపీ హనుమంతరావు మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాజుల రామారం పరిధి నెహ్రూనగర్కు చెందిన గోగుల దేవ సహాయం అలియాస్ దేవ (27) స్టోన్కటింగ్వర్క్ చేస్తుంటాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మసాగర్ కు చెందిన రెడ్డి రమేష్ (27) ఎలక్ట్రీషియన్. వీరు గత డిసెంబర్ లో షాపూర్నగర్లోని కల్లు దుకాణం వద్ద పరిచయం అయ్యారు.
ఇద్దరూ తాగుడుకు బానిసలుగా మారారు. ఈజీ మనీ కోసం ఇంటి ముందు పార్క్చేసిన మొత్తం 17 బైకులను చోరీ చేశారు. వాటిని షాపూర్నగర్పరిధి కళావతినగర్కు చెందిన మన్నె రాజు (35), నిజామాబాద్కు చెందిన కలాల్ శివకుమార్ గౌడ్ (23) వద్ద తనఖా పెట్టేవారు. వచ్చిన డబ్బుతో నలుగురు జల్సాలు చేసేవారు. బైక్ల చోరీపై అందిన ఫిర్యాదులతో జీడిమెట్ల పోలీసులు స్పెషల్ టీమ్ తో నిఘా పెట్టి దేవ సహాయం, రెడ్డి రమేష్, మన్ను రాజును అరెస్ట్ చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌడ్ పరారీలో ఉన్నాడు.
