
- టాప్ టెన్లో ఇద్దరు...ట్వంటీలో ఐదుగురు మనోళ్లే
- దేశవ్యాప్తంగా 54,378 మంది క్వాలిఫై
- ‘హైదరాబాద్’ జోన్ నుంచే
- 12,946 మంది అర్హత
- నేషనల్ టాపర్గా రజిత్ గుప్తా
- జూన్ 3 నుంచి జోసా కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు:జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ స్టూడెంట్లు సత్తా చాటారు. టాప్ టెన్లో ఇద్దరు, టాప్ ట్వంటీలో ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. దీంతోపాటు అత్యధికంగా 12,946 మంది హైదరాబాద్ జోన్ నుంచే క్వాలిఫై అయ్యారు.
మే 18న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ల్లోని ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలను ఐఐటీ కాన్పూర్ సోమవారం రిలీజ్ చేసింది. ఈ పరీక్షలకు 1,87,223 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 1,80,422 మంది పేపర్ 1, పేపర్ 2 రాశారు.
వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో 44,974 మంది అబ్బాయిలు, 9,404 మంది అమ్మాయిలు ఉన్నారు. 332 మార్కులతో నేషనల్ టాపర్ గా ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన రజిత్ గుప్తా నిలిచాడు. 332 మార్కులతో సాక్షమ్ జిందాల్ 2వ ర్యాంకు సాధించారు.ఉమెన్స్ కేటగిరీలో టాపర్గా ఐఐటీ ఖరగ్ పూర్కు చెందిన దేవదత్త మాఝీ (16వ ర్యాంకు) నిలిచింది. అయితే, ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319 మార్కులతో 9వ ర్యాంకుతో పాటు హైదరాబాద్ జోన్ టాపర్గా నిలిచాడు. అదే జోన్ స్టూడెంట్ ఏపీకి చెందిన వడ్లమూడి లోకేశ్ 317 మార్కులలో ఆలిండియా 10వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి 18వ ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన వంగల అజయ్ రెడ్డి 19వ ర్యాంకు, అవనగంటి అనిరుద్ రెడ్డి 20వ ర్యాంకు సాధించారు. అయితే, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వంగల అజయ్ రెడ్డి సాధించగా, ఓబీసీ– ఎన్సీఎల్ కేటగిరి నేషనల్ టాపర్ గా ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి నిలిచారు. మరోపక్క, హైదరాబాద్ జోన్ పరిధిలో ఉమెన్స్ టాపర్గా 78వ ర్యాంకర్ కే.రసజ్ఞ- ఉన్నారు.
హైదరాబాద్ జోన్ నుంచే ఎక్కువ మంది
దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ డ్ విద్యార్థులను 7 జోన్లు విభజించారు. దీంట్లో అత్యధికంగా క్వాలిఫై అయిన వాళ్లు ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి 12,946 మంది ఉన్నారు. టాప్ 500 ర్యాంకుల్లో ఇదే జోన్ నుంచి 139 మంది ఉండటం గమనార్హం. అయితే, ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. ఐఐటీ ఢిల్లీ జోన్ నుంచి 11,370 మంది, ఐఐటీ బాంబే జోన్ నుంచి 11,226 మంది, ఐఐటీ రూర్కీ నుంచి 5,454, ఐఐటీ ఖారగ్ పూర్ నుంచి 5,353 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 5,295, ఐఐటీ గౌహతీ నుంచి 2,743 మంది అర్హత సాధించారు.
జోన్ కౌన్సెలింగ్లో 127 కాలేజీలు
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పలు సంస్థల్లో జేఈఈ ర్యాంకుల ఆధారంగా నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. జోన్ కౌన్సెలింగ్ లో 127 విద్యాసంస్థలు పాల్గొననున్నాయి. కాగా, ఈనెల 3 నుంచి రిజిస్ట్రేషన్ల, ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నెల 14న ఫస్ట్ రౌండ్ సీట్ల అలకేషన్ ఉంటుంది. జూన్ 21న సెకండ్ రౌండ్, జూన్28న థర్డ్ రౌండ్, జులై 4న నాల్గో రౌండ్, జులై 10న ఐదో రౌండ్, జులై 16న ఆరో రౌండ్ సీట్ల అలకేషన్
ఉంటుందని అధికారులు ప్రకటించారు.
భారీగా తగ్గిన కటాఫ్
జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించడానికి గతేడాది కటాఫ్ మార్కులు 109 ఉంటే.. ఈసారి 74గా ఖరారు చేశారు. ఓబీసీలో 66, ఈడబ్ల్యూఎస్లో 66, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ తదితర కేటగిరీల్లో 37 మార్కులను కటాఫ్గా పెట్టారు.