త్వరలో జేఈఈ మెయిన్స్ ఫలితాలు: రమేశ్ పోఖ్రియాల్

త్వరలో జేఈఈ మెయిన్స్ ఫలితాలు: రమేశ్ పోఖ్రియాల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినందుకు స్టూడెంట్స్, పేరెంట్స్ కు ఎడ్యుకేషనల్ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసినందుకు మప్పిదాలు చెప్పారు. జేఈఈ రిజల్ట్ సంబంధించిన పనులు మొదలయ్యాయని, అతి త్వరలో ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ 2020 ఎగ్జామ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ‘ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పరీక్షలు రాసినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఫలితాలకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. త్వరలోనే రిజల్ట్స్ వెల్లడవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, ఎన్టీఏ సిటీ కోఆర్డినేటర్స్, ఇన్విజిలేటర్స్, ఎగ్జామినేషన్ విజయవంతం అవ్వడానికి మద్దతు ఇచ్చి కారకులైన వారికి మప్పిదాలు’ అని రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పటిష్ట సేఫ్టీ ప్రోటోకాల్స్ మధ్య జేఈఈ పరీక్షలను నిర్వహించారు. దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 11న జేఈఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.