నిజామాబాద్ జిల్లాలో రెండేండ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లాలో  రెండేండ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : జీవన్ రెడ్డి
  • బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి​

​ఆర్మూర్, వెలుగు : జిల్లాలో రెండేండ్లు చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్​, బీజేపీ ఎమ్మెల్యేలు శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్​లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పదేండ్లలో తను చేసిన అభివృద్ధి పనులను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. 

రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను వివరించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలని సవాల్​విసిరారు. కేసీఆర్ పాలనలోనే జిల్లాలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. 

ఆర్మూర్ లో ఆర్టీవో ఆఫీస్, లిఫ్ట్​ఇరిగేషన్స్, గురుకులాలు, కాలేజ్​లు మంజూరయ్యాయని, సిద్దులగుట్ట ఘాట్​రోడ్డు, వందల కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్లు వేయించానని, కుల సంఘాలకు ఫంక్షన్ హాల్స్ నిర్మించానని చెప్పారు. రెండేండ్లలో చారాణా పనిచేయని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి, కాంగ్రెస్​ఇన్​చార్జి వినయ్​రెడ్డి తనను విమర్శించడం మానుకోవాలన్నారు. 

ప్రజలు ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్​ నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్​, పూజా నరేందర్, మీర శ్రావణ్, పృథ్వీ, గణేశ్, అజీమ్, అభిలాష్, లతీఫ్, రహమత్, సత్తర్ పాల్గొన్నారు.