కొత్త ఏడాదిలో మళ్లీ ఎగరనున్న  జెట్​ విమానాలు

కొత్త ఏడాదిలో మళ్లీ ఎగరనున్న  జెట్​ విమానాలు
  • బాకీదారులకు 5 ఏళ్లలో రూ. 1,183 కోట్లు చెల్లింపు
  • ఎయిర్​పోర్టులలో స్లాట్లు తిరిగి పొందడానికి చురుగ్గా ప్రయత్నాలు
  • కొత్త యజమాన్యం వెల్లడి

న్యూఢిల్లీ: కొత్త ప్రమోటర్ల చేతికి వచ్చిన జెట్​ ఎయిర్ వేస్​ కొత్త సంవత్సరంలో మళ్లీ విమానాలు నడపడానికి రెడీ అవుతోంది. ఆరు విమానాలతో 2022లో ఆపరేషన్స్​ మొదలు పెట్టనున్నట్లు కొత్త ఓనర్లు చెప్పారు. ఇందుకోసం  రిజొల్యూషన్​ ప్లాన్​ అమలును వేగవంతం చేయాల్సిందిగా ఎన్​సీఎల్​టీని కోరినట్లు పేర్కొన్నారు. దివాలా అంచులకి చేరడంతో ఈ ఎయిర్​లైన్స్​ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జలాన్​–కల్​రాక్​ కన్సార్టియమ్​ జెట్​ ఎయిర్​వేస్​ను చేజిక్కించుకుంది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ ఎంట్రప్రెనూర్​ మురారి జలాన్​, బ్రిటన్​ కంపెనీ కల్​రాక్​ క్యాపిటల్​ మేనేజ్​మెంట్​లు కన్సార్టియమ్​గా ఏర్పడ్డాయి. ఉద్యోగులు సహా బాకీదారులందరికీ చెల్లింపులు జరపడానికి కన్సార్టియమ్​ సిద్ధంగా ఉందని కంపెనీ ఒక స్టేట్​మెంట్​లో తెలిపింది. జూన్​ 2021లో ఎన్​సీఎల్​టీ ఆమోదించిన రిజొల్యూషన్​ ప్లాన్​ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. రిజొల్యూషన్​ ప్లాన్​ ఎఫెక్టివ్​ డేట్​గా డిసెంబర్​ 22 ని పరిగణించమని ఎన్​సీఎల్​టీని కోరినట్లు కూడా కొత్త యజమాన్యం వెల్లడించింది. బాకీదారులకు రాబోయే అయిదేళ్లలో రూ. 1,183 కోట్లను చెల్లించేందుకు కన్సార్టియమ్​ అంగీకరించింది. అంతేకాకుండా,  మొదటి రెండేళ్లలో రూ. 600 కోట్ల మేర చెల్లింపుల జరపడానికి ఫండ్స్​ రెడీ చేసేందుకూ ఒప్పుకుంది. మిగిలిన మొత్తాన్ని ఆ తర్వాత  ఏళ్లలో చెల్లిస్తారు. 2022లో ఆపరేషన్స్​ మొదలపెట్టాలనే ఉత్సాహంతో ఉన్నట్లు జలన్​ చెప్పారు.

చాలా ఆలోచించే జెట్​ ఎయిర్​వేస్​లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాన్ని జలన్​తో కలిసి తీసుకున్నట్లు  కల్​రాక్​ క్యాపిటల్​ చైర్మన్​ ఫ్లోరియన్​ ఫ్రిట్చ్​ వెల్లడించారు. ఆపరేషన్స్​ ప్రారంభించడం కోసం వివిధ ప్రభుత్వ విభాగాలతో డిస్కషన్స్​ మొదలయినట్లు కూడా పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం 35 వేల అప్లికేషన్స్​ వచ్చాయని, కేండిడేట్లను ఎంపిక చేసే ప్రాసెస్‌‌లో ఉన్నామని కన్సార్టియమ్​ వెల్లడించింది. కాగా,  వివిధ ఎయిర్​పోర్టులలోని స్లాట్లను తీసుకోవడం వంటి వాటిలో జాప్యం కారణంగా జెట్​ ఎయిర్​వేస్​ ఆపరేషన్స్​ రీలాంఛ్​ ఆలస్యం అయింది.