- రాష్ట్రంలో మలబార్ రిఫైనరీ, జ్యువలరీ యూనిట్లు
హైదరాబాద్, వెలుగు: జ్యువలరీ రంగంలో పేరొందిన మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. గోల్డ్, డైమండ్ జ్యువలరీ తయారు చేయడానికి ఫ్యాక్టరీతోపాటు, గోల్డ్ రిఫైనరీ కూడా పెట్టడానికి రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 750 కోట్లను వెచ్చించాలనుకుంటున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం పీ అహ్మద్ వెల్లడించారు. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావును మలబార్ గ్రూప్ ప్రతినిధులు కలిశారు. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు, అనుకూలమైన ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్లే ఇక్కడ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టనున్నట్లు అహ్మద్ ఈ సందర్భంగా చెప్పారు. తమ ప్రాజెక్టుల వల్ల 2500 మంది నిపుణులైన స్వర్ణకారులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చిన మలబార్ గ్రూప్ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, అన్ని విధాలుగా సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలు మలబార్ గ్రూప్కు నచ్చడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు. తెలంగాణలో నిపుణులయిన స్వర్ణకారులకు కొదవ లేదని, వారి ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఇక్కడి నిపుణులలో వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మలబార్ గ్రూప్ను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు.మలబార్ గ్రూప్కు దేశ, విదేశాలలో 260 జ్యువలరీ స్టోర్లున్నాయి. తెలంగాణలో ప్రపోజ్ చేస్తున్న కొత్త ప్రాజెక్టుతో తమ మాన్యుఫాక్చరింగ్ మరింత బలోపేతమవుతుందనే ఆశాభావాన్ని మలబార్ గ్రూప్ వ్యక్తం చేస్తోంది. మలబార్ గ్రూప్ ప్రతినిధులతోపాటు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.