వెలుగు: రిలయన్స్ జియోకు చెందిన రెండు సంస్థలు రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2వేల కోట్ల చొప్పున నిధులను సేకరించనున్నాయి. జియో ఇంటర్నెట్, జియో టీవీలు 10 లక్షల షేర్లు జారీచేయడం ద్వారా రూ.2 వేల కోట్ల చొప్పున నిధులు సమీకరించుకోనున్నాయి. రిలయన్స్ జియో గత ఏడాది తమ టెలికమ్, కంటెంట్ బిజినెస్ లను వేరు చేయడానికి జియో ఇంటర్నెట్, జియో టీవీతో కలిపి ఆరు అనుబంధ సంస్థలను ఏర్పాటుచేసింది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం 10 లక్షల షేర్ల జారీ ద్వారా ఒక్కో కంపెనీ రూ.2 వేల కోట్ల చొప్పున నిధులను సేకరించనున్నాయని, డివిడెండ్ రేట్ 6 శాతంగా నిర్ణయమైందని సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ నిధులను సాధారణ కార్పోరేట్ అవసరాలకు, భవిష్యత్ పెట్టుబడి అవసరాల వంటివాటికోసం వినియోగించుకోనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన టెలికమ్ ఆస్తులను సొంతం చేసుకోవడానికి కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎప్పటినుండో టెలికమ్ టవర్ బిజినెస్ ను దక్కించుకోవాలని బ్రూక్ఫీల్డ్ ప్రయత్నిస్తోంది. ఆర్ఐఎల్ డీమెర్జర్ ప్రాసెస్ ను పూర్తిచేస్తున్నందున బ్రూక్ఫీల్డ్తో డీల్కు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చు. టవర్లు, ఫైబర్ నెట్వర్క్తో కలిపి ఈ డీల్ విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.