ముంబై : ‘దేశ్ కీ నయా దుకాణ్’ వచ్చేస్తోంది. బిలీనియర్ ముకేశ్ అంబానీ దీనిని తీసుకొస్తున్నారు. జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్… ఆన్లైన్ షాపింగ్లోనూ తన సత్తా చూపించాలనుకుంటున్నారు. గ్లోబల్ ఈ–కామర్స్ కంపెనీలు అమెజాన్, వాల్మార్ట్లకు పోటీగా ముకేశ్ అంబానీ తన కొత్త కామర్స్ వెంచర్ను సాఫ్ట్ లాంచ్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, తన జియో టెలికాం యూజర్లకు ఇన్విటేషన్లను పంపుతోంది. జియోమార్ట్ పేరుతో రాబోతున్న కొత్త వెంచర్ను రిజిస్టర్ చేసుకోవాలని కోరుతోంది. దీన్ని దేశ్ ఈ నయా దుకాణ్గా అభివర్ణిస్తోంది. నవీ ముంబై, ఠాణే, కల్యాణ్ ప్రాంతాల్లోని ఆన్లైన్ షాపర్లకు ఇప్పటికే జియోమార్ట్ సర్వీసులు అందించేందుకు సిద్ధమైంది. రిలయన్స్ రిటైల్ అధికారులు జియోమార్ట్ లాంచ్ను ధ్రువీకరిస్తూ… దీన్ని దేశవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరిస్తామని తెలిపారు. ‘అవును, మా ఆపరేషన్స్ను సాఫ్ట్ లాంచ్ చేశాం. జియో యూజర్లందరు ప్రిలిమినరీ డిస్కౌంట్లను అందిపుచ్చుకోవడానికి జియోమార్ట్పై రిజిస్టర్ అవ్వాలని ఇన్విటేషన్లను పంపుతున్నాం. ఇది ప్రస్తుతం మూడు రీజన్లలోనే ఉంది. తదుపరి దీన్ని విస్తరిస్తాం. త్వరలోనే జియోమార్ట్ యాప్ ను కూడా లాంచ్ చేస్తాం’ అని కంపెనీ అధికారులు చెప్పారు.
ఉచితంగా, వేగంగా డెలివరీ
జియోమార్ట్ తన యూజర్లకు 50వేలకు పైన గ్రోసరీ ప్రొడక్ట్లను కొనుగోలు చేసుకునేందుకు అనుమతిస్తోంది. అంతేకాక ఎలాంటి మినిమమ్ ఆర్డర్ వాల్యూ లేకుండానే ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తోంది. రిటర్న్ పాలసీలో ఎలాంటి ప్రశ్నలు అడగదు. ఎక్స్ప్రెస్ డెలివరీ ఆఫర్ చేస్తోంది.