ముంబై: ప్రస్తుతం ఇండియాలో 5జీ టెక్నాలజీ లేకున్నా, ఇలాంటి ఫోన్ల ధరలు రూ.27 వేలపైమాటే! రిలయన్స్ జియో మాత్రం రూ.మూడు వేలలోపే 5జీ ఫోన్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మొదట్లో దీని రేటు రూ.ఐదు వేల వరకు ఉన్నా, అమ్మకాలు పెరిగే కొద్దీ ధర రూ.మూడు వేలకు తగ్గిస్తామని చెబుతోంది. ఇప్పుడు 2జీ వాడుతున్న దాదాపు 30 కోట్ల మందిని ఈ ఫోన్ ద్వారా తమ నెట్వర్క్లోకి ఆకర్షిస్తామనే నమ్మకం ఉందని జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు.
మనదేశంలో అత్యంత తక్కువ రేటుతో 4జీ ఫోన్ను లాంచ్ చేసింది కూడా జియోనే! కేవలం సెక్యూరిటీ డిపాజిట్గా రూ.1,500 తీసుకుంది. కొంతకాలం తరువాత ఫోన్ వద్దనుకుంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చింది. ముంబైలో జరిగిన 43వ ఏజీఎంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ మనదేశంలో 2జీ, ఫీచర్ ఫోన్ యూజర్లను తక్కువ ధర స్మార్ట్ఫోన్ల ద్వారా 5జీ టెక్నాలజీవైపు తీసుకెళ్లాలని అన్నారు. జియోలో 7.7 శాతం వాటాను రిలయన్స్ గూగుల్కు అమ్మింది. అండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం రెండు కంపెనీలు కలసి పనిచేస్తాయని అంబానీ వెల్లడించారు. ఇదిలా ఉంటే, తమ సొంత నెట్వర్క్ ఎక్విప్మెంట్తోనే 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి తమకు స్పెక్ట్రమ్ ఇవ్వాలని రిలయన్స్ రిక్వెస్ట్కు కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.