75 డాలర్లకే జియో నెక్స్ట్ఫోన్
ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్
రిలయన్స్ బిజినెస్ భారీగా పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: ఇదివరకే జియో ఫీచర్ ఫోన్తో మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్.. మరో సెన్సేషన్ తీసుకురావడానికి రెడీ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనిధర 50 నుంచి 75 డాలర్ల కంటే (దాదాపు రూ.3,500 నుంచి రూ.5,400 మధ్య) తక్కువే ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మనదేశంలో ప్రస్తుతం 30 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లు ఉంటారని అంచనా. వీరిలో మెజారిటీ యూజర్లతో తన అండ్రాయిడ్ ఫోన్ను కొనిపించడం ద్వారా మరింత ఎదగాలన్నది జియో ప్లాన్. వీళ్లంతా స్మార్ట్ఫోన్కు మారడం వల్ల డేటా వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఫోన్లు, రీచార్జ్ల అమ్మకం.. ఇలా రెండు విధాలా కంపెనీ లాభపడుతుంది. అంతేకాదు కస్టమర్ల డేటాను ఉపయోగించుకొని రెవెన్యూ పెంచుకునే ప్లాన్స్ కూడా రెడీ అవుతున్నాయి. యూజర్లకు తక్కువ మొత్తాల్లో లోన్లు ఇవ్వాలనే ఆలోచన ఇందులో ముఖ్యమైనది. ఇందుకోసం జియో బ్యాంకులతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది. మనదేశంలో మెజారిటీ ప్రజలకు సిబిల్ వంటివి ఇచ్చే క్రెడిట్స్కోర్లు లేవు. ఈ స్కోరు లేకుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఇలాంటి వాళ్ల ఆన్లైన్ లావాదేవీలను పరిశీలించి.. అర్హత ఉంటే చిన్నమొత్తాలను లోన్లుగా ఇవ్వాలన్నది జియో ప్లాన్. చిన్న వ్యాపారాలకూ లోన్లు ఇస్తారని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, ఫేస్బుక్లకు కూడా జియోలో వాటాలు ఉన్నందున.. జియో నెక్స్ట్ఫోన్ కస్టమర్ల డేటాను ఇవి కూడా ఉపయోగించుకొని బిజినెస్ను పెంచుకుంటాయని సమాచారం. ఈ ఫోన్ ఈ నెలే మార్కెట్లోకి వస్తుంది.
రికార్డు లెవెన్స్కు షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం లైఫ్టైమ్ హై రూ. 2,374.90లకు చేరుకుంది. రాబోయే ట్రేడ్ సెషన్లలో షేర్ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. వచ్చే 12 నెలల్లో రూ.3000 వరకు దూసుకెళ్లవచ్చని అంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెరగడంపై జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ మాట్లాడుతూ జియో, రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్లు పెరగడం, సౌదీ ఆరామ్కో డీల్లో పురోగతి కనిపించడం, సోలార్ పవర్ సెగ్మెంట్లోకి కంపెనీ అడుగుపెట్టడం వంటివి రిలయన్స్ షేర్ ధర పెరగడానికి కారణాలని చెప్పారు.
జి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్లో వాటా కొన్న రిలయన్స్
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్లో రూ.393 కోట్లకు వాటాను కొనుగోలు చేసినట్లు శుక్రవారం రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఒక్కోషేరుకు రూ.10 చొప్పున 2,28,42,654 ఈక్విటీ షేర్లను రూ.393 కోట్లకు కొన్నామని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 160 కోట్ల వరకు మరో పెట్టుబడి పూర్తవుతుందని ప్రకటించింది. ఈ పెట్టుబడికి ప్రభుత్వ లేదా రెగ్యులేటరీ ఏజెన్సీ పర్మిషన్ అవసరం లేదని రిలయన్స్ తెలిపింది. దీంతో కలుపుకుంటే స్ట్రాండ్లోని ఈక్విటీ షేర్ క్యాపిటల్ 80.3శాతానికి చేరుతుంది. జినోమిక్ టెస్టింగ్ కంపెనీ స్ట్రాండ్ 2000లో ఇండియాకు వచ్చింది. డాక్టర్లు, ఆసుపత్రులు, మెడికల్ డివైజ్ల తయారీదారులు, ఫార్మా కంపెనీలకు బయోఇన్ఫర్మేటిక్స్ సాఫ్ట్వేర్, క్లినికల్ రీసెర్చ్ సొల్యూషన్స్ అందిస్తుంది. 2021, 2020, 2019 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ టర్నోవర్ వరుసగా రూ. 88.70 కోట్లు, రూ. 109.84 కోట్లు రూ. 96.60 కోట్లు.
2030 నాటికి 100 గిగావాట్ల సోలార్ పవర్
న్యూఢిల్లీ: 2030 నాటికి సోలార్ వంటి రెన్యువబుల్ ఎనర్జీ తయారీ కెపాసిటీని కనీసం 100 గిగావాట్లకు పెంచుతామని రిలయన్స్ ప్రకటించింది. దీనిని కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ ఫ్యూయెల్గా మార్చుతామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. రాబోయే పదేళ్లలో కేజీ హైడ్రోజన్ ధర డాలర్లోపునకు (దాదాపు రూ.74) తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కరెంటును గ్రీన్హైడ్రోజన్గా మార్చి పెట్రోల్, డీజిల్కు బదులుగా వాడుకోవచ్చని ఢిల్లీలో నిర్వహించిన క్లైమేట్ సమిట్లో వెల్లడించారు.
రూ.15 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్
తాజా ర్యాలీ వల్ల రిలయన్స్ మార్కెట్ క్యాప్ విలువ రూ.15 లక్షల కోట్లకు చేరింది. ఒక ఇండియా కంపెనీ ఇంత భారీగా మార్కెట్ క్యాప్ సాధించడం ఇదే మొదటిసారి. బీఎస్ఈలో రిలయన్స్ షేరు విలువ శుక్రవారం 4.12 శాతం పెరగడంతో రూ.2,388లకు చేరింది. ఈ ఏడాది జూన్ మూడున రిలయన్స్ మార్కెట్ క్యాప్ తొలిసారిగా రూ.14 లక్షల మార్క్ను చేరుకుంది. ఈ ఏడాది రిలయన్స్ షేర్లు 20 శాతానికిపైగా లాభపడ్డాయి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 ఇంచుల డిస్ప్లే
వెనుక 13 ఎంపీ కెమెరా
8 ఎంపీ కెమెరా
క్వాల్కామ్ 215 చిప్సెట్
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ
2,500 ఎంఏహెచ్ బ్యాటరీ