మొత్తం IPL పుణ్యమే: జియో హాట్‎స్టార్‎కు 30 కోట్ల మంది సబ్‎స్క్రైబర్లు

మొత్తం IPL పుణ్యమే: జియో హాట్‎స్టార్‎కు 30 కోట్ల మంది సబ్‎స్క్రైబర్లు

ముంబై: ఓటీటీ ప్లాట్​ఫామ్ జియోహాట్‌‌‌‌స్టార్ మొత్తం సబ్​స్క్రయిబర్ బేస్ 30 కోట్ల మందికి చేరుకుంది. గ్లోబల్​ఓటీటీ కంపెనీ నెట్‌‌‌‌ఫ్లిక్స్ చివరిగా ప్రకటించిన 30.16 కోట్ల కంటే ఇది కొంచెమే తక్కువ. ​ఇటీవల ముగిసిన టాటా ఐపీఎల్ తమ సబ్​స్క్రయిబర్ల సంఖ్య పెరుగుదలకు కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జియోహాట్‌‌‌‌స్టార్ సబ్​స్క్రయిబర్ల సంఖ్య ఐదు కోట్లు మాత్రమే ఉంది. అప్పుడు రిలయన్స్ నేతృత్వంలోని జియోసినిమా, డిస్నీ+హాట్‌‌‌‌స్టార్ విలీనంతో జియోహాట్​స్టార్ ఏర్పడింది. 

డిస్నీ స్టార్ ఐదు సంవత్సరాలకు రూ.23,575 కోట్లు చెల్లించి ఐపీఎల్​టోర్నమెంట్ టీవీ ప్రసార హక్కులను గెలుచుకుంది. అయితే భారతదేశ డిజిటల్ హక్కులను రిలయన్స్‎కు చెందిన వయాకామ్ రూ.20,500 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 3న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,  పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌‌‌లో రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్​సీబీ జట్టు గెలిచింది. 

ఈ మ్యాచ్​ను డిజిటల్‌‌‌‌లో 23.7 కోట్ల మంది, టెలివిజన్‌‌‌‌లో 18.9 కోట్ల మంది చూశారని జియోస్టార్ రిపోర్ట్​ తెలిపింది. 2024 డిసెంబర్ చివరి నాటికి 190 దేశాలలో నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌కు 30.16 మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్,- డిసెంబర్​లో కొత్తగా 1.8 కోట్ల మంది సబ్​స్క్రిప్షన్ ​తీసుకున్నారని నెట్​ఫ్లిక్స్​ తెలిపింది.