
- జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీఎస్పీ, బీజేడీ
- వ్యతిరేకించిన కాంగ్రెస్, పీడీపీ, టీఎంసీ, ఆర్జేడీ.. నేడు లోక్సభ ముందుకు
- ఒక రాష్ట్రం తగ్గింది.. ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అసెంబ్లీతో కూడిన యూటీగా జమ్మూకాశ్మీర్ను, అసెంబ్లీలేని యూటీగా లడఖ్ను వేరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా స్వయం ప్రతిపత్తి హోదా పోయి.. దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్లోనూ భారత రాజ్యాంగం అమలవుతుంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై.. జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చించింది. ఆ వెంటనే రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జమ్మూకాశ్మీర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ‘ఆర్టికల్ 370 రద్దు’ చేస్తున్నట్లు గెజిట్ విడుదలైంది.
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నట్లు అమిత్షా ప్రకటించారు. ఆయన ప్రకటన చేస్తుండగానే.. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గందరగోళం నడుమే.. విభజనకు సంబంధించిన ‘జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్– 2019’ బిల్లును కూడా అమిత్ షా ప్రవేశపెట్టారు. కేంద్రంపై పీడీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ప్రతులను చింపేసి, తమ షర్టులను కూడా చింపుకొని ఆందోళనలకు దిగారు. వారిని మార్షల్ సాయంతో చైర్మన్ బయటకు పంపించేశారు.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొద్ది సేపు రాజ్యసభ లైవ్ ప్రసారాలను నిలిపివేశారు. ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ను వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభ స్వీకరించింది. ఆర్టికల్ 370 రద్దు, విభజనను కాంగ్రెస్, టీఎంసీ ,ఆర్జేడీ వంటి పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని దుయ్యబట్టాయి.
అయితే.. బీఎస్పీ, బీజేడీ, ఆప్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, టీడీపీ సహా పలు పార్టీలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలిచాయి. ఆర్టికల్ 370 రద్దుపై, విభజన బిల్లుపై రాజ్యసభలో సాయంత్రం వరకు చర్చ జరిగింది. అటు తర్వాత చైర్మన్ వెంకయ్యనాయుడు జమ్మూకాశ్మీర్ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ పెట్టగా అది ఈజీగా పాసైంది. ఆపై ‘జమ్మూకాశ్మీర్ రీ ఆర్గనైజేషన్–2019’ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లుపడ్డాయి. దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ రాజ్యసభ ఆమోదం తెలిపినట్లు చైర్మన్ ప్రకటించి సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో బిల్లు పాస్ కాగానే.. హోంమంత్రి అమిత్ షాను ప్రధాని మోడీ అభినందించారు. బీజేపీ సభ్యులు సంబురాలు జరుపుకొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని, విభజన బిల్లును సోమవారం లోక్సభలోనూ ప్రవేశపెట్టినప్పటికీ దీనిపై మంగళవారం అక్కడ చర్చ జరుగనుంది. ఇప్పటికే లోక్సభలో జమ్మూకాశ్మీర్ ఈడబ్ల్యూఎస్ బిల్లు పాసైంది.
ఆర్టికల్ 370తో పాటే 35ఏ రద్దు
నెహ్రూ హయాంలో జమ్మూకాశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తూ ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు. దీని ద్వారా దేశంలో ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేక రాజ్యాంగం అక్కడ అమలవుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఆర్టికల్ 370లో ఆర్టికల్ 35ఏను జోడించారు. దశాబ్దాలుగా వీటిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులతో ఆర్టికల్ 370 రద్దవగా.. దానితోపాటే అందులోని 35 ఏ కూడా రద్దయిపోయింది.
ఇన్నాళ్లూ రాష్ట్రంగా.. ఇక రెండు యూటీలుగా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఎక్కడా లేని అధికారాలు ఉన్నాయి. దేశమంతా అసెంబ్లీలకు ఐదేండ్లకు ఒక్కసారి ఎన్నికలు జరిగితే అక్కడ ఆరేండ్లకు ఒక్కసారి జరుగుతాయి. అక్కడ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరయ్యేది. కేంద్రం విడుదల చేసే నిధులు కేవలం జమ్మూకాశ్మీర్ ప్రాంతానికే పరిమితమవుతున్నాయని, ఆర్టికల్ 370ని అలుసుగా చేసుకొని మూడు కుటుంబ పార్టీలే రాజ్యమేలుతున్నాయని, ఎలాంటి అభివృద్ధి లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, టెర్రరిజం పెరిగిపోతోందని బీజేపీ వాదిస్తోంది. ఆ ఆర్టికల్ను రద్దు చేయాలని శ్యామ ప్రసాద్ ముఖర్జీ వంటి వారు 60ఏండ్ల కిందే ఉద్యమించారు. అదే స్ఫూర్తితో ఇటీవల బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ‘‘ఇదొక చారిత్రాత్మక ముందడుగు.. ఇకపై జమ్మూకాశ్మీర్కు ఆర్టికల్ 370 వర్తించదు”అంటూ అమిత్ షా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు బిల్లును ప్రవేశపెట్టారు. ఢిల్లీ, పుదుచ్చేరిలో ఉన్నట్లు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్, చండీగఢ్ మాదిరి అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ అవతరించనుంది. ఈ బిల్లుకు కీలకమైన రాజ్యసభ ఆమోదం పూర్తవడంతో మంగళవారం లోక్సభలోనూ ఆమోదం ఈజీగా లభించనుంది. అటు తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే.. దేశ ముఖచిత్రం నుంచి ఒక రాష్ట్రం పోయి.. అదనంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేరుతాయి. ఇప్పటివరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంతో కలిపి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా.. జమ్మూకాశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదా పోవడం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడంతో ఇక మీదట 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కానున్నాయి.
సవరణ బిల్లులు పెట్టకుండా మార్చేయొచ్చా?
కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ, ఇకపై ఆ రాష్ట్రంలో ‘రాజ్యాంగ సభ’ ఉండదని, దాని స్థానంలో ‘శాసన సభ’ ఏర్పాటవుతుందని, అసెంబ్లీపై అధికారాలు పార్లమెంట్కు లభిస్తాయంటూ రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ను అమిత్ షా రాజ్యసభలో చదివి వినిపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. ఆ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టగానే సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. ‘‘సవరణ బిల్లులు పెట్టకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను మార్చేయొచ్చా?’’అని ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ప్రశ్నించారు. అమిత్ షా బదులిస్తూ.. రాజ్యాంగ ఉత్తర్వులతో ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందనే నిబంధన అదే ఆర్టికల్లో ఉందని, గతంలో కాంగ్రెస్ సర్కారు రెండుసార్లు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఆర్టికల్ 370లోని నిబంధనల్ని సవరించిందని, ప్రస్తుత మోడీ సర్కార్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నదని తెలిపారు. ఆర్టికల్ 370 ద్వారా హామీలు ఇవ్వడం వల్లే జమ్మూకాశ్మీర్ ఇండియాలో విలీనమైందని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజన్నారు.
పక్కాగా.. ప్లాన్గా..
దాదాపుగా ఏ బిల్లునైనా మొదట లోక్సభలో, అటు తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడుతుంటారు. ఇటీవల కీలకమైన ఆర్టీఏ, ట్రిపుల్ తలాక్, ఉగ్రవాద నిరోధక బిల్లును కూడా అలానే ప్రవేశపెట్టి అక్కడ పాస్ అయ్యాక రాజ్యసభలో ఆమోదింపజేశారు. కానీ.. ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదనతో పాటు జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును మొదట రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టింది. జమ్మూకాశ్మీర్ అంశం సున్నితమైన అంశం కావడంతో దీనిపై మొదటి నుంచి గోప్యత పాటిస్తూ వచ్చింది. గత కొన్నిరోజుల నుంచి జమ్మూకాశ్మీర్కు కేంద్రం భారీగా బలగాల తరలించింది. 370 ఆర్టికల్ రద్దు, విభజన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని గుర్తించి ఇలా ముందస్తు చర్యలు చేపట్టింది. సోమవారం కూడా భారీగా బలగాలు జమ్మూకాశ్మీర్కు తరలాయి. పార్లమెంట్లో తీర్మానం, బిల్లు ప్రవేశపెట్టడంలోనూ ఇలాంటి పంథానే మోడీ సర్కార్ అవలంబించింది. ముందుగా లోక్సభలో ప్రవేశపెడితే సమస్యలు ఎదురవుతాయని, ప్రతిపక్షాలకు టైం, చాన్స్ ఇచ్చినట్లవుతుందని భావించింది. తనకు పెద్దగా బలంలేని కీలకమైన రాజ్యసభలో ఆమోదం లభిస్తే అంతా సెట్ అవుతుందని అంచనా వేసింది. ప్రతిపక్షాల్లో చీలిక, రీజినల్ పార్టీల మద్దతు కలిసి వచ్చి రాజ్యసభలో బిల్లు గట్టెక్కింది. ఇక లోక్సభలో ఎన్డీయేకు పూర్తి స్థాయి
మెజారిటీ ఉండటంతో అక్కడ ఈజీగా పాస్అవుతుంది.
దేశానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం తలలా ఉండేది. ఇప్పుడు ఆ తలను కేంద్రం రెండుగా నరికేసింది. జమ్మూకాశ్మీర్ విభజనను నేను కలలో కూడా
ఊహించలేదు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజు. బిల్లు పేరిట అమిత్ షా రాజ్యసభలో ఆటం బాంబు ప్రయోగించారు. బిల్లును మా పార్టీ వ్యతిరేకిస్తోంది. గుజరాత్ ను యూటీగా ప్రకటించే దమ్ముందా?
– కాం గ్రెస్ నేత గులాం నబీ ఆజాద్
వాజ్పేయి లేనిలోటు
పార్లమెంట్, సుప్రీంకోర్టులపై జమ్మూకాశ్మీర్ ప్రజలకున్న నమ్మకాన్ని పోగొట్టే చర్య ఇది. న్యాయంగా, హక్కుగా మాకు దక్కాల్సిన దాన్ని ప్రభుత్వం మోసపూరితంగా లాక్కెళ్లింది. దీంతో కాశ్మీర్ సమస్య మరింత జఠిలం కానుంది. మోడీ కూడా వాజ్పేయి బాటలోనే నడుస్తారని మేం నమ్మాం. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేశారు. వాజ్పేయి లేని లోటు మాకు తెలిసొచ్చింది.
– మెహబూబా ముఫ్తీ, పీడీపీ చీఫ్