- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
- మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కాంగ్రెస్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ డ్రామాలు చేస్తున్నాడని, సోయా కొనుగోళ్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసేందుకు వెనుకాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఫైర్ అయ్యారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నామన్నారు.
సోయా కొనుగోళ్లలో అధికార యంత్రంగా నిర్లక్ష్యం, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతాంగం పూర్తిగా మోసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగిరాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, మారశెట్టి గోవర్ధన్, ఎ.తిరుపతి, బి.సతీశ్, గణేశ్యాదవ్, దమ్మపాల్ కొండ తదితరులు పాల్గొన్నారు.
