ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉత్సాహంగా వజ్రోత్సవ క్రీడలు

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్​ పటేల్​ స్టేడియంలో ఫ్రీడం కప్​ క్రికెట్, కబడ్డీ, షటిల్, టేబుల్​టెన్నిస్, టగ్​ ఆఫ్  వార్​ ఫైనల్​ పోటీల్లో కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ​విష్ణు ఎస్​ వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్​ ఆదర్శ్​ సురభి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఫైనల్​ పోటీలను కలెక్టర్​ అనుదీప్​ ప్రారంభించి పలు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువజన క్రీడల అధికారి సీతారాం, మున్సిపల్​ చైర్​పర్సన్​ కె. సీతాలక్ష్మి, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, హార్టికల్చర్​ ఆఫీసర్​ మరియన్న, తహసీల్దార్లు రామకృష్ణ, శ్రీనివాస్, భద్రకాళి  పాల్గొన్నారు. 

వేదోక్తంగా భాగవత సప్తాహం

భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం భాగవత సప్తాహం వేదోక్తంగా సాగింది. ఆరాధన, సేవాకాలం, శాత్తుమురై, అగ్నిప్రతిష్ట, వేదవిన్నపాలు చేశాక సప్తాహ పారాయణం, గోపూజ చేశారు. దశమస్కంధ హోమం ప్రారంభించి మద్భాగవతం 1వ స్కంధం నుంచి 3వ స్కంధంలో 20వ అధ్యాయం వరకు పారాయణం చేశారు. ప్రవచనం తర్వాత మంగళాశాసనాలు ఇచ్చి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. రామయ్యకు ముస్లిం భక్తుడి విరాళం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఎస్కే జాన్​మహ్మద్​ శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావుకు అందజేశారు.

కొనసాగుతున్న వీఆర్ఏల ఆందోళన

ఖమ్మం టౌన్/భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ సమ్మె చేపట్టిన వీఆర్ఏలు గురువారం ఖమ్మంలో బోనాలతో నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని స్టేట్  వైస్  ప్రెసిడెంట్ చల్లా లింగరాజు తెలిపారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెంలో బతుకమ్మ, ఆటపాటలతో పోస్టాఫీస్​ సెంటర్​ నుంచి కలెక్టరేట్​ వరకు వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. 

ఉత్సాహంగా వజ్రోత్సవ క్రీడలు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్​ పటేల్​ స్టేడియంలో ఫ్రీడం కప్​ క్రికెట్, కబడ్డీ, షటిల్, టేబుల్​టెన్నిస్, టగ్​ ఆఫ్  వార్​ ఫైనల్​ పోటీల్లో కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ​విష్ణు ఎస్​ వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్​ ఆదర్శ్​ సురభి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఫైనల్​ పోటీలను కలెక్టర్​ అనుదీప్​ ప్రారంభించి పలు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువజన క్రీడల అధికారి సీతారాం, మున్సిపల్​ చైర్​పర్సన్​ కె. సీతాలక్ష్మి, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, హార్టికల్చర్​ ఆఫీసర్​ మరియన్న, తహసీల్దార్లు రామకృష్ణ, శ్రీనివాస్, భద్రకాళి పాల్గొన్నారు. 

గోదావరి వరద బాధితుల ధర్నా

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సబ్ కలెక్టర్​ కార్యాలయం ఎదుట గురువారం గోదావరి వరద బాధితులు ధర్నా నిర్వహించారు. పట్టణంలో మెయిన్​ రోడ్ల గుండా ర్యాలీ చేశారు. గోదావరి వరదలతో భద్రాచలం టౌన్​లోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని, పోలవరం బ్యాక్​వాటర్​తో ఏటా ఇదే పరిస్థితి ఉంటోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎత్తయిన ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించాలంటూ డిమాండ్​ చేశారు. సబ్​ కలెక్టర్​ కార్యాలయంలో ఏవో శేషుకు వినతిపత్రం ఇచ్చారు.

రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలి

టేకులపల్లి/ఇల్లందు,వెలుగు: ఓసీలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్  సూచించారు.  టేకులపల్లి మండలం కోయగూడెం, ఇల్లందు ఏరియాలోని ఓపెన్​కాస్ట్​ గనులను సందర్శించారు.  రోజువారి బొగ్గు ఉత్పత్తి, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనుల వివరాలను జనరల్ మేనేజర్ ఎం.షాలేము రాజును అడిగి తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని, వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ పంజాల శ్రీనివాస్, ప్రాజెక్ట్  ఆఫీసర్​ మల్లారపు మల్లయ్య, మధుసూదన్ రావు, సర్వే ఆఫీసర్​ బి.నరేశ్​ పాల్గొన్నారు.