- టీచర్ల కొరతతో జూబ్లీపుర ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఇబ్బందులు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని సారథినగర్ లో ఉన్న జూబ్లీపుర ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో 1 వ క్లాస్ నుంచి 5 వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 68 మంది స్టూడెంట్స్ కు టీచర్ ఒక్కరే అన్ని పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్ గా, హెచ్ఎంగా రెండు విధాలా విధులు నిర్వహిస్తున్న బాణోత్ భాస్కర్ కు అదనపు భారంగా మారింది.
ముగ్గురు టీచర్లు ఉండాల్సిన స్కూల్ లో ఒక్కరే అన్ని తరగతులకు సబ్జెక్టు ల వారీగా బోధించడం సమస్యగా ఉందని స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్క్ అడ్జెస్ట్ మెంట్ లో భాగంగా రెండు నెలల కింద రఘునాథ పాలెం మండలం చిమ్మపూడి స్కూల్ నుంచి జూబ్లీపుర స్కూల్ కు ఓ టీచర్ ను విద్యాశాఖ కేటాయించింది.
ఆమె జాయిన్ అయిన కొద్దీ రోజుల్లోనే ఆమెపై స్టూడెంట్స్ తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు రావడంతో తిరిగి పాత స్థానానికి టీచర్ గా పంపించారు. దాంతో దాదాపు అప్పటి నుంచి సుమారు 45 రోజులుగా జూబ్లీపుర స్కూల్లో ఒక్క టీచరే పాఠాలు భోదిస్తూ నెట్టుకొస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్టూడెంట్స్ పేరెంట్స్ కోరుతున్నారు.
