
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. దీంతో సోమవారం నుంచి కళాశాలలు రీఓపెన్ కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1న ఆదివారం కావడంతో.. జూన్ 2 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నది.
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలతోపాటు గురు కులాల్లోనూ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు మొదలుకానున్నాయి. కాగా, ఇప్పటివరకు మొత్తం 1,126 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. దీంట్లో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు 225 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే, ప్రస్తుతమున్న కాలేజీల్లో ఏ కాలేజీకి గుర్తింపు ఉంది? దేనికి లేదు? అనేది ఇంటర్ బోర్డు అధికారికంగా వెల్లడించాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇటీవలే ఇంటర్ బోర్డు 2025–26 అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం 226 వర్కింగ్ డేస్ ఉంటాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి ఫస్ట్ వీక్ లో పబ్లిక్ పరీక్షలు ఉంటాయని తెలిపారు.