మా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కళ్యాణ్ రామ్ అన్న ఒక్కరే. ‘బింబిసార’తో ఫ్యాన్స్ ఆకలి తీర్చేశారు. నటుడిగా, నిర్మాతగా, టెక్నాలజీకి పెద్ద పీట వేసింది కూడా ఆయనే’ అని చెప్పాడు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర నాథ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమిగోస్’ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నేను ‘జై లవకుశ’లో ట్రిపుల్ రోల్ చేశా. అదెంత కష్టమో నాకు తెలుసు. అన్నయ్య ఇందులో అద్భుతంగా నటించారు. ‘అమిగోస్’ అన్న కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఆషికాకి ఇది పర్ఫెక్ట్ లాంచ్. దర్శకుడు రాజేంద్ర నాథ్కి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది. నిర్మాతలు నవీన్, రవిశంకర్ను కుటుంబ సభ్యులుగా భావిస్తాం’ అన్నాడు. ఇక ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ని ఒక విన్నపం ఇచ్చాడు. ‘ఒక్కో సినిమాకు ప్రతిరోజూ అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. ఫ్యాన్స్ ఉత్సాహం, ఆరాటం మాకు అర్థమవుతుంది. కానీ అది దర్శక నిర్మాతలపై ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. నేనొక్కడినే కాదు.. అందరు హీరోలు ఇదే ప్రెజర్కి గురవుతున్నారు. అప్డేట్ ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే భార్యకంటే ముందు అభిమానులకే చెబుతాం. కొరటాల దర్శకత్వంలో ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేస్తాం’ అని చెప్పాడు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. చిరంజీవి గారి ‘ముగ్గురు మొనగాళ్లు’, మా తమ్ముడు ‘జై లవకుశ’ చిత్రాల్లో ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురిగా నటించారు. ఫస్ట్ టైమ్ మనిషిని పోలిన మనుషులు అనే యూనిక్ కాన్సెప్ట్తో తీశాం. కచ్చితంగా ప్రేక్షకులు డిసప్పాయింట్ అవ్వరు’ అన్నాడు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.