
న్యూఢిల్లీ : ఇండియా రెజ్లింగ్ వివాదం కొత్త మలుపు తీసుకుంది. టోర్నీలు లేకపోవడం వల్ల తమ కెరీర్లో ఓ ఏడాది విలువైన సమయాన్ని కోల్పోయామని వందలాది మంది జూనియర్ రెజ్లర్లు రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని అఖాడాలకు చెందిన 300 మంది జూనియర్ రెజ్లర్లు బుధవారం జంతర్ మంతర్ వద్ద 3 గంటల పాటు ధర్నాకు దిగారు. స్టార్ రెజ్లర్లు బజ్రంగ్, సాక్షి, వినేశ్ వల్లే తాము నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ కెరీర్లను ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ కాపాడాలని బ్యానర్లు ప్రదర్శించారు. 10 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యపై బ్యాన్ ఎత్తి వేయాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసిన జూనియర్లు.. వెంటనే ఏజ్ గ్రూప్ పోటీలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన రెజ్లింగ్ అడ్హక్ ప్యానెల్ ఆరు వారాల్లో అండర్–15, 20 నేషనల్స్ను నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ సంజయ్ సింగ్.. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలకు దూరంగా ఉంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సాక్షి మాలిక్ వెల్లడించింది.