బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా వైరస్ సోకింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా వైరస్ బారిన పడ్డారు . ప్రస్తుతం వారిద్దరు ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్యోతిరాదిత్య, అతని తల్లి మాధవి గత కొన్ని రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఇద్దరికీ వైరస్ టెస్ట్లు చేయగా.. కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు. గత నాలుగు రోజులుగా వారు మాక్స్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
అంతకుముందు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా కూడా కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది, సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కొన్ని రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఆయన కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్నారు. అందుకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది.