సూర్యాపేట, వెలుగు: బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. నరసింహ రావు పిలుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల బాల్య వివాహ నిరోధక కార్యాచరణ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన బాల్య వివాహాలు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా వైద్య అధికారి వెంకటరమణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన అనేది ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్న అంశమన్నారు. ప్రజలు యువత అధికారులు అందరి సమన్వయంతో ప్రయత్నం చేస్తే 2030 లోపే బాల్యవివాహాలను సూర్యాపేట జిల్లాలో సమూలంగా నిర్మూలించవచ్చన్నారు.
బాలల చట్టాలు పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు నిలుపుదల చేసేందుకు చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. రవికుమార్, సీడీపీఓ సుబ్బలక్ష్మి, కాలేజీ ప్రిన్సిపల్ యాదయ్య ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
