తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లకు ప్రజాశాంతి పార్టీ 100 స్థానాలు గెలుస్తుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రజలు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలిందన్నారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో 60 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కేఏపాల్.
తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని కేఏపాల్ అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి ,కుట్ర పాలన అని ప్రజలకు అర్ధ మైందన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ రానివాళ్లు 300 మంది నాయకులు ప్రజాశాంతి వైపు వస్తారన్నారు. బీఆర్ఎస్ లో అవినీతి భూకబ్జాలు చేసిన వాళ్లకు.. లక్షల కోట్లు దోచుకున్న వాళ్లకు కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారే తప్ప.. ఒక్క నీతిపరుడికి టికెట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
బ్రతికి ఉన్నప్పుడు గద్దర్ ను ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వని కేసీఆర్.. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయించారన్నారు. ఈవీఎంల లోపం వల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు కేఏపాల్. కవితపై కేసులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ మోడీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు.