
- అక్రమ ఆస్తుల పంపకాల్లో తేడాతోనే పంచాయితీ
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్
జనగామ, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతే కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలానికి కారణమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు, ధరణి పోర్టల్ ద్వారా సంపాదించిన వందల ఎకరాల అక్రమ ఆస్తుల పంపకాల పంచాయితీ వల్లే కేసీఆర్ కుటుంబంలో గొడవలు తలెత్తాయని తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డితో కలిసి లింగాల ఘన్పూర్ మండలం నవాబుపేట రిజర్వాయర్నుంచి దేవాదుల నీటిని విడుదల చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. కేసీఆర్ఫ్యామిలీ తెలంగాణ వనరులను దోచుకుందని ఆరోపించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అని అన్నారు. అందుకే దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ 1,015 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.
తొలిసారి నవాబుపేట రిజర్వాయర్ కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. లింగాల ఘనపూర్, దేవరుప్పుల, గుండాల మండలాల్లో 43 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధీర్, అధికారులు, కాంగ్రెస్లీడర్లు, రైతులు పాల్గొన్నారు.