కాళేశ్వరం గుదిబండ ! ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్ట్

కాళేశ్వరం గుదిబండ ! ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్ట్
  • కాళేశ్వరం గుదిబండ!
  • ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్ట్
  • ఆర్ఈసీ ఔట్​ స్టాండింగ్​ రుణం రూ.17,232 కోట్లు
  • రూ.890 కోట్లు బకాయి​.. ఈ నెల 6న సర్కారుకు ఆర్​ఈసీ లేఖ
  • జూన్​ 29లోపు కట్టకుంటే నిరర్థక ఆస్తిగా పరిగణిస్తామని వార్నింగ్​
  • ఇరిగేషన్​ కార్పొరేషన్​ కట్టాల్సింది మరో 10,278 కోట్లు..
  • వాయిదా కింద చెల్లించాల్సిన రూ.503 కోట్లు పెండింగ్​
  • ఈ నెల 29లోపు  రూ.1,393 కోట్లు చెల్లించాల్సిందే
  • రుణాల రీస్ట్రక్చర్​ కోసం సర్కారు యత్నం.. కేంద్రం, ఆర్ఈసీ ససేమిరా

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర సర్కారు పాలిట కాళేశ్వరం ప్రాజెక్టు  గుదిబండలా మారింది. ఆ ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి మరీ తీసుకున్న రుణాల చెల్లింపులు సర్కారుకు కష్టమైపోతున్నాయి. కార్పొరేషన్​కు పైసా ఆదాయం లేకపోవడం.. గ్యారంటీగా ఉన్న ప్రభుత్వమే కార్పొరేషన్​ రుణాలను చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతున్నది. అప్పు వాయిదాలు కట్టకుంటే కాళేశ్వరం కార్పొరేషన్​ను నిరర్థక ఆస్తిగా పరిగణిస్తామంటూ అప్పు ఇచ్చిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇటు రుణాల రీస్ట్రక్చర్​ అయినా చేసుకుందామా అంటే కేంద్రం నుంచీ అరకొర స్పందనే వస్తున్నది. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే అదీ లేదు. దీంతో  కాంగ్రెస్​ ప్రభుత్వానికి కాళేశ్వరం ఆర్థిక భారంగా తయారైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్​కు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రూ.97,449 కోట్ల రుణం మంజూరు కాగా.. అందులో రూ.79,287 కోట్లు విడుదలయ్యాయి. ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.6 వేల కోట్లు చెల్లిస్తుండగా.. ప్రస్తుతం ఇంకా రూ.70 వేల కోట్ల వరకు అసలే చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.10 వేల కోట్లను రుణ సంస్థలు రీషెడ్యూల్​ చేశాయి. అయితే, ప్రాజెక్టుకు రుణాలిచ్చిన సంస్థల్లో ఒకటైన రూరల్​ ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్​ (ఆర్ఈసీ) లిమిటెడ్​.. ప్రాజెక్ట్​ రుణ వాయిదాలు కట్టాలంటూ ఈ నెల 6న రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. లేకపోతే నిరర్థక ఆస్తిగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆర్ఈసీ నుంచి తీసుకున్న రుణాల్లో తెలంగాణ స్టేట్​ వాటర్​ రీసోర్సెస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు సంబంధించి రూ.10,278 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్​కు సంబంధించి రూ.17,232 కోట్లు ఇంకా ఔట్​ స్టాండింగ్​ ఉందని ఆర్ఈసీ లేఖలో పేర్కొన్నది. ఆ రెండు కార్పొరేషన్లకు సంబంధించి రూ.1,393.65 కోట్లు (కాళేశ్వరం కార్పొరేషన్​ రూ.890.31 కోట్లు, ఇరిగేషన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ రూ.503.33 కోట్లు) వాయిదా చెల్లించాల్సి ఉందని, 68 రోజులుగా చెల్లించడం లేదని తెలిపింది. 

ఈ నెల 28, 29వ తేదీల్లోగా రుణ వాయిదాలను చెల్లించకపోతే రెండు కార్పొరేషన్ల లోన్​ అకౌంట్లను నిర్థరక ఆస్తులుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. రుణ వాయిదాల చెల్లింపు 2  నెలలుగా బకాయి పడడంతో.. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గైడ్​లైన్స్​ ప్రకారం స్పెషల్​ మెన్షన్​ అకౌంట్​ 2గా రిపోర్ట్​ చేశామని పేర్కొన్నది. రుణ వాయిదాల చెల్లింపును ఆలస్యం చేస్తే ఆయా సంస్థలు, రాష్ట్ర రేటింగ్​ తగ్గుతుందని, దీంతో ఆర్థిక స్థితిగతులపై ప్రభావం పడుతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆ రూ.1,393.65 కోట్ల బకాయిలను చెల్లించాలని తేల్చి చెప్పింది. 

  • నిరుడు అక్టోబర్​ నుంచే లేఖలు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పీఎఫ్‌‌‌‌సీ నుంచి 10.75 శాతం, ఆర్‌‌‌‌ఈసీ నుంచి 11.25 శాతం వడ్డీతో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం షార్ట్​ టర్మ్​ లోన్స్​ తీసుకున్నది. వడ్డీ ఎక్కువ కావడంతో ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదాల భారం ఎక్కువగా ఉంటున్నది. ఆ రెండు సంస్థలకు కలిపి ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం కార్పొరేషన్​కు ఆదాయం లేకపోవడంతో.. గ్యారంటీగా ఉన్న ప్రభుత్వమే వాటిని చెల్లిస్తున్నది. ఈ నేపథ్యంలోనే వడ్డీల భారం తగ్గించుకుని కాల పరిమితిని పెంచుకునేందుకు ప్రభుత్వం నిరుడు అక్టోబర్​లోనే తొలిసారి ఆర్‌‌‌‌ఈసీకి లేఖ రాసింది. వడ్డీ రేట్లను 9 శాతానికి తగ్గించడంతోపాటు రుణ చెల్లింపు కాలపరిమితిని కనీసం 20 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్​ నాటికి ఇరిగేషన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​, కాళేశ్వరం కార్పొరేషన్ల రుణాల ఔట్​స్టాండింగ్​ రూ.30 వేల కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నది. 

ఈ నేపథ్యంలోనే 2030 నాటికి 9 శాతం, ఆర్థిక సంవత్సరం 2031 నుంచి 2035 మధ్య 18 శాతం, 2036 నుంచి 2040 వరకు 27 శాతం, 2040 తర్వాత మిగతా 46 శాతం చెల్లించేలా రుణాలను రీస్ట్రక్చర్​ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇటు సీఎం రేవంత్​ రెడ్డి కూడా రుణాలను రీస్ట్రక్చర్​ చేయాలని విజ్ఞప్తి చేస్తూ నిరుడు డిసెంబర్​లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండి.. లోన్​ టర్మ్​ తక్కువగా ఉండడం వల్ల రాష్ట్ర ఖజానాపై పెను ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. 

  • స్పందన కరువు..

ఇటు కేంద్రం నుంచి గానీ.. అటు ఆర్ఈసీ నుంచి గానీ రుణాల రీస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారుకు అనుకూలమైన సమాధానం రాలేదు. ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, అలాంటప్పుడు వడ్డీ రేట్లలో రిబేట్​ ఇవ్వడం సాధ్యంకాదని నిరుడు నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఆర్ఈసీ స్పష్టం చేసింది. ఆర్ఈసీ అనేది నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కార్పొరేషన్​ కాబట్టి.. రుణ చెల్లింపులు ఒక్కరోజు ఆలస్యమైనా ఆర్బీఐకి రిపోర్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి వాయిదాలను టైంకు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పార్ల మెంట్​లో.. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలను రీస్ట్రక్చర్​ చేయడం సాధ్యం కాదని, ముందు ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వాయిదాల చెల్లింపులు ఆలస్యమైతే క్రెడిట్​ రేటింగ్​పై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

  • ప్రాజెక్ట్​ పూర్తికాకముందే గొప్పల కోసం ప్రారంభం..

కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డ్​ టైంలో మూడేండ్లలోనే పూర్తి చేశామన్న బీఆర్‌ఎస్ గొప్పలన్నీ కట్టు కథలేనని ఇటు కేంద్రం, అటు ఆర్‌ఈసీ సమాధానాలతో తేటతెల్లమైపోయింది. ప్రాజెక్ట్​ పూర్తికాకముందే.. 
గత ప్రభుత్వం దానిని ప్రారంభించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా  గిన్నిస్​ బుక్  రికార్డుల కోసం పనులను చేయడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో సమస్యలు ఏర్పడ్డాయని, మేడిగడ్డ కుంగిపోయిందన్న విమర్శలు ఉన్నాయి.  అదీకాకుండా వేల కోట్ల రుణాలు తీసుకున్నా.. ఆ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వకపోవడం ఫెయిల్యూర్​ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు లిఫ్టుల కరెంట్​ ఖర్చులకే 
రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

  • కాళేశ్వరానికే రూ.68,200 కోట్ల అప్పు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్​ను ఏర్పాటు చేసిన గత బీఆర్‌‌‌‌ఎస్​ సర్కారు.. సుమారు రూ.68,200 కోట్ల అప్పు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వమే ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (పీఎఫ్‌‌‌‌సీ) నుంచి రూ.37,737.11 కోట్లు, ఆర్ఈసీ నుంచి రూ.30,536.08 కోట్ల రుణాలను సమీకరించినట్టు స్పష్టం చేసింది. ఆ రెండు సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.31,795  కోట్లు రిలీజ్​ అయ్యాయి. ఆర్ఈసీ నుంచి ఇప్పటివరకు రూ.19,448 కోట్లు డిస్బర్స్​ కాగా.. అందులో ఇంకా రూ.17,232 కోట్ల మేర అసలు ఔట్​స్టాండింగ్​ ఉన్నది. పీఎఫ్‌‌‌‌సీ నుంచి మరో రూ.12,347 కోట్లు రిలీజ్​ అయ్యాయి.  

ఇక, సీతారామ, దేవాదుల, కంతనపల్లి, ఇందిరమ్మ ఫ్లడ్​ఫ్లో కెనాల్​ పనుల కోసం ఇరిగేషన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు ఆర్‌‌‌‌‌‌‌‌ఈసీ రూ.13,517 కోట్ల రుణాన్ని మంజూరు చేయగా.. అందులో రూ.12,618 కోట్లను రిలీజ్​ చేసింది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్​కు సంబంధించి రూ.10,278 కోట్లు ఔట్​స్టాండింగ్​ ఉన్నది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలకు వడ్డీ, అసలు చెల్లింపులే ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలను రీస్ట్రక్చర్​ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు.