- భూ సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం
- రాహుల్ గాందీ ఇన్విటేషన్ మేరకే ఆయనని కలిశాను
- ధరణి ఎత్తేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మద్దతిస్తా
- ప్రజా గాయకుడు గద్దర్
మెదక్ జిల్లా: రాష్ట్రంలో భూ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరో ఉద్యమం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రజా గాయకుడు గద్దర్ వెల్లడించారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తన సొంతూరైన మెదక్ జిల్లా తూప్రాన్ లో తన తల్లి లక్ష్మమ్మ సమాధి వద్ద ఆయన పూలు మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో పేద రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ధరణి ఎత్తివేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తాను మద్దతు ప్రకటిస్తానన్నారు.
మొదట్లో తాను కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి స్వాగతం పలికానని, కానీ ప్రస్తుతం తూప్రాన్ లో ఉన్న తన ఎకరా పొలంలో నుంచి కాలేశ్వరం ప్రాజెక్టు వెళుతుందని తన ఎకరా పొలం బదులుగా మరోచోట ఆ భూమిని ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. స్థలం కేటాయించాలని గత రెండేళ్లుగా జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశానని గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో భూమి ప్రాజెక్టులో పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు పొలం సాగు చేసి తనని ఉన్నత విద్య చదివించేందుకు ఎంతోకష్టపడ్డారని చెప్పారు.
భూమికి బదులు భూమి ఇస్తేనే కాళేశ్వరం నీళ్లు పోనిస్తా
ప్రభుత్వం భూమికి భూమికి ఇచ్చే వరకు కాలేశ్వరం పనులు జరగకుండా చూస్తానని గద్దర్ అన్నారు. అవసరం అయితే నా పొలానికి కంచేవేసుకుని అక్కడే కూర్చుంటానని గద్దర్ తేల్చిచెప్పారు. ఈవిషయంలో రెండు రోజుల్లో హైకోర్టు కోర్టులో కేసు వేస్తానని తెలిపారు. శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశంలోనూ ఈ ధరణితో తలెత్తుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో టిఆర్ఎస్ సాగిస్తున్న పాలనపై పలు విషయాలను చర్చించానన్నారు. ఇందులో ప్రధానంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన విషయాలను ఆయనకు వివరించానన్నారు. రాహుల్ గాంధీ సైతం సానుకూలంగా స్పందించారనన్నారు.
రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఇతర తెగల వారికి సైతం భూమికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
తూప్రాన్ లో తన తల్లి లక్ష్మమ్మ పేరుతో పాటల స్కూల్ ఏర్పాటు చేస్తానని, దానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా భూమి కేటాయించలేదని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే తనకు ఉన్న ఒక ఎకరం పట్టా భూముల నుంచి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, తనకు భూమికి బదులుగా భూమి ఇచ్చే వరకు పనులు జరగనివ్వనని స్పష్టం చేశారు. నా పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఎలాంటి స్వార్థం లేకుండా మూడున్నర కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టేందుకు చొరవ తీసుకున్నానన్నారు. ప్రస్తుతం పచ్చని పొలాలతో కళకళలాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 135 ఎకరాల భూమి కాలేశ్వరం ప్రాజెక్టులో పోతుండటంతో రైతులు అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారని గద్దర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆస్క్ KTR: ప్రిన్సిపాల్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి
సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం
కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!