
- పాత డిజైన్ ప్రకారమే ప్రాణహిత,చేవెళ్ల ప్యాకేజీ 22 పనులు
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాకు సాగునీటిని అందించే ప్రాణహిత–-చేవెళ్ల(కాళేశ్వరం) ప్యాకేజీ 22 పనులు ముందుకెళ్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. శనివారం కామారెడ్డి ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో ప్యాకేజీ 22 పనులు, తాగునీటి పైప్లైన్, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో రివ్యూ చేశారు. పనులు స్పీడప్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ 22 పనులను పాత డిజైన్ ప్రకారం చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారన్నారు.
పెండింగ్లో ఉన్న 316 ఎకరాల భూ సేకరణకు సంబంధించిన అమౌంట్ చెల్లించేందుకు రూ.23 కోట్లు రిలీజ్ అయ్యాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాణహిత–-చేవెళ్ల ప్యాకేజీ 20, 21, 22 పనులు చేపట్టామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్యాకేజీ 22 పనులను నిర్లక్ష్యం చేసిందని, డిజైన్ మార్పుతో పనులు ముందుకెళ్తాయా? లేదా? అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల ఈ పనులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హైదరాబాద్లో రివ్యూ చేసి, పాత డిజైన్ ప్రకారం పనులు చేపట్టేందుకు నిర్ణయించారన్నారు.
కామారెడ్డి మండలం తిమ్మక్పల్లిలో త్వరలో రిజర్వాయర్ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. తిమ్మక్పల్లి, మోతే, కాటేవాటి, ధర్మారావుపేటల్లో చేపట్టే రిజర్వాయర్లతో 5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచవచ్చని, వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి సర్ ప్లస్వాటర్ ఇక్కడికి తరలిస్తారని తెలిపారు. కామారెడ్డి ఏరియాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చడమే తన జీవత ఆశయమన్నారు. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంధర్, ఆర్డీవో వీణ, లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.