
కామారెడ్డి, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణ్, గ్రామీణ్ 2పై జిల్లా స్థాయి వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పారిశుధ్య నిర్వహణ ఉండాలన్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపాటు గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని, ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2 వ విడత స్కూల్ యూనిఫాం త్వరగా అందజేయాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 3 పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మరళీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పర్యటించిన చైల్డ్ రైట్స్ మెంబర్
చైల్డ్ రైట్స్ మెంబర్ ప్రేమలత అగర్వాల్ గురువారం జిల్లాలో పర్యటించారు. రాజీవ్నగర్కాలనీలోని అంగన్వాడీ సెంటర్, జిల్లా కేంద్రంలోని
బాలసదన్ను ఆమె పరిశీలించారు. పిల్లలకు, గర్భిణులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా సంక్షేమాధికారి ప్రమీల తదితరులు ఉన్నారు.