కామారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు 37,409

కామారెడ్డి జిల్లాలో  కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు 37,409
  • కామారెడ్డి జిల్లాలో  మొత్తం లబ్ధిదారుల సంఖ్య 9,15,127 మంది 
  • కొత్త రేషన్​ కార్డులు 1,249 జారీ     

కామారెడ్డి, వెలుగు: కొన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న  వేలాది మందికి  లబ్ధి  చేకూరింది.  ప్రభుత్వం ఇది వరకే ఉన్న  పాత రేషన్​ కార్డుల్లో కొత్తగా మెంబర్లను చేర్పటం,   కొన్ని ఫ్యామిలీలకు కొత్త రేషన్​ కార్డులు  జారీ చేయటం ప్రక్రియను చేపట్టింది.  ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కొత్తగా రేషన్​ కార్డుల్లో 37,409 మంది లబ్ధిదారులు చేరారు. 1,249 కొత్త కార్డులు  జారీ చేశారు. పాత కార్డులతో, కొత్త కార్డుల్లో కలిపి మే నెల రేషన్​కు కొత్తగా 37,409 మందిని చేర్చారు.   వీరికి మే నుంచి  బియ్యం పంపిణీ చేస్తారు.  ఒక్కొక్కరికి 6  కిలోల చొప్పున ఇస్తారు. 

ఎదురు చూపులకు మోక్షం

 రేషన్​ కార్డుల్లో  కొత్తగా తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చటం,   మార్పులు, చేర్పుల కోసం  ఐదారేండ్లుగా  ఎదురు చేస్తున్నారు. మీ సేవాతో పాటు,  రెవెన్యూ ఆఫీసుల్లో అప్లికేషన్లు ఇచ్చారు. గతంలో  కొత్త కార్డుల జారీకి, ఉన్న వాటిలో మెంబర్లను చేర్చేందుకు అవకాశం లేదు.  అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కార్డుల జారీతో పాటు, ఉన్న వాటిలో పేర్లు చేర్చాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతులు  వచ్చారు. ఈ తరుణంలో  ఈ ప్రభుత్వం  అర్హులైన వారికి కొత్త కార్డుల జారీతో పాటు,  పాత వాటితో మెంబర్లను చేర్చటానికి చర్యలు తీసుకుంది. 

రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య.. 9.15,127

ప్రజాపాలన ప్రోగ్రాంలో అప్లికేషన్లు స్వీకరించారు.  మీ సేవలో కూడా అప్లయ్​చేసుకున్నారు. ఈ అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎట్టకేలకు కొత్త మెంబర్లను చేర్చారు.   మే నెల కు  కొత్తగా 37, 409 మంది రేషన్​ కార్డుల్లో మెంబర్లు పెరిగారు.  గతంలో  2,53,651 కార్డులు ఉండగా వీటిలో 8,77,718 మంది మెంబర్లు ఉన్నారు.   ప్రస్తుతానికి జిల్లాలో రేషన్​ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య  9,15,127 మందికి చేరారు.  5,600 మెట్రిక్​ టన్నుల వరకు బియ్యం అవసరపడుతాయి.

   గత నెల నుంచి సర్కారు రేషన్​ షాపుల్లో సన్నబియ్యం సప్లయ్​ చేస్తోంది. లబ్ధిదారులు ఈ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.    ఇంకా జిల్లాలో  10వేల మంది వరకు   అప్లీకేషన్లు పెండింగ్​లో ఉన్నట్లు తెలుస్తోంది.  మీ సేవాలో అప్లయ్​, ప్రజాపాలనలో అప్లయ్​ చేసుకున్న వారిని వివిధ దశల్లో  పెండింగ్​లో ఉన్నాయి.  ఈ అప్లీకేషన్లకు కూడా మోక్షం కలిగితే  రేషన్​ లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరగనుంది.