కామారెడ్డి, వెలుగు: వడ్లు ఎప్పుడు కొంటరా అని కొనుగోలు సెంటర్లో ఎదురుచూస్తూ కుప్ప దగ్గరే ఇంకో రైతు ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య(55) పది రోజుల క్రితం తన వడ్లను స్థానిక కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే కావలి ఉంటున్నారు. గురువారం సాయంత్రం రాజయ్య కుప్ప వద్ద కావలి ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పి వస్తున్నదని, చెమటలు పడుతున్నయని మిగతా రైతులకు చెప్పాడు.
వాళ్లు వెంటనే ఆయన్ను కామారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రాజయ్య అప్పటికే గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు. కొనుగోలు సెంటర్లో రాజయ్య సీరియల్ నంబర్102 ఉంది. గురువారం నాటికి సెంటర్లో 90 నంబర్ పూర్తయ్యింది. ఇంకో రెండు రోజులయితే ఆయన వడ్లు కాంట అయ్యేవి. ఇంతలోనే చనిపొవటంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇటీవలే జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన రైతు బీరయ్య వడ్ల కుప్పపైనే చనిపోయిన సంగతి తెలిసిందే.