కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నదాతలు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో అధికారులు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండానే నిర్ణయం తీసుకున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాత రాజంపేట గ్రామంలో సమావేశం కానున్న రైతులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సమావేశానికి 8 గ్రామాల రైతులు హాజరు కానున్నారు. రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. డ్రాఫ్ట్ ప్లాన్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే రైతులు మాత్రం మాస్టర్ ప్లాన్ కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

