కామారెడ్డి/కామారెడ్డిటౌన్, వెలుగు: భూ తగదాలతో తండ్రీకొడుకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి డీఎస్సీ మధుసూదన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్కు చెందిన బండారి రాజిరెడ్డి(55) మే 29 నుంచి కనిపించట్లేదని అతని కొడుకు రంజిత్ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భూ తగదాల నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన మందాల ఎల్లయ్య, అతని కొడుకు ప్రణీత్కుమార్పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఎంక్వైరీ చేయగా, భూ తగదాలతో రాజిరెడ్డిని తండ్రి, కొడుకులు ఎల్లయ్య, ప్రణీత్కుమార్ హత్య చేసినట్లు తేలింది. ముందస్తు ఫ్లాన్ ప్రకారం మే 29న రాజిరెడ్డికి ఫోన్ చేసి ఎల్లయ్య పశువుల కొట్టం వద్దకు పిలిపించారు. అక్కడకు రాగానే ఎల్లయ్య, ప్రణీత్కుమార్ కలిసి ఇనుప రాడ్తో దాడి చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.
చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత డెడ్బాడీని లింగాపూర్ గ్రామ శివారులోని నీళ్లు లేని పాడుబడిన బావిలో గుంత తవ్వి పూడ్చి పెట్టారు. ఎల్లయ్య వద్ద రాజిరెడ్డి కొద్ది నెలల కింద 26 గుంటల భూమిని రూ.1.26 కోట్లకు కొనేందుకు అగ్రిమెంట్ చేసుకొని రూ.28 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఈ డబ్బులను తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ శివారులో రాజిరెడ్డి బంధువుల దగ్గర భూమి కొనాలని నిర్ణయించి అడ్వాన్స్గా ఇచ్చారు.
ఈక్రమంలో రాజిరెడ్డి మిగతా డబ్బులు ఇవ్వకపోగా, ఎర్రపహాడ్లో భూమి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుతగులుతున్నాడని ఎల్లయ్య, అతని కొడుకు భావించారు. అమ్మిన భూమికి మొత్తం డబ్బులు ఇవ్వకపోగా, తాము కొన్న భూమి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుతగులుతున్నాడనే ఉద్దేశంతో హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు శ్రీధర్ గౌడ్, నరహరి, ఎస్సైలు రంజిత్, భువనేశ్వర్ పాల్గొన్నారు.
