హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కన్నారావు ఆదిభట్లలో భూకబ్జాకు పాల్పడ్డారని ఓఎస్ఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో అదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కన్నారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ జి రాధారాణి సోమవారం విచారించారు.
తనకు సంబంధం లేని భూమిలోకి చొరబాటు, భూకబ్జా, ఆయుధాలు ఉండటం, గొడవకు దిగడం వంటి అభియోగాలతో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. అభియోగాలు తీవ్రమైనవని, ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. చట్టప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇదే కేసును కొట్టేయాలని కన్నారావు వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.