
- సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ
- పరిశీలించి పరిష్కరిస్తున్న తహసీల్దార్లు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మే 5 నుంచి 22వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. 4 మండలాల్లో కలిపి 5,176 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 1,798 దరఖాస్తులు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో 1,281, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 1,253, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో 844 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో మండలంలో ఇద్దరు తహసీల్దార్లతో కూడిన రెండు బృందాలు చెరి సగం గ్రామాల్లో అర్జీలు స్వీకరించి పరిష్కరిస్తున్నాయి. ప్రభుత్వం వీరికి టార్గెట్ విధించడంతో రెవెన్యూ సిబ్బంది సెలవుల్లేకుండా
పనిచేస్తున్నారు.
సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ
భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించిన అన్ని గ్రామాల్లో సర్వే నంబర్ మిస్సింగ్, మ్యుటేషన్ పెండింగ్, కోర్టు ఉత్తర్వుల అమలు, సాదాబైనామా, పీవోటీ, తహసీల్దార్ డిజిటల్ సైన్ పెండింగ్, విస్తీర్ణంలో సవరణ, భూమిసంక్రమించిన విధానం, భూమి స్వభావంలో మార్పులు, పట్టాదారు పేరు, తండ్రి పేరు, కులం, జెండర్ తదితర వివరాల్లో తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించడం, సివిల్ వివాదాలు, ఓఆర్సీ జారీ కాకపోవడం, వారసత్వ సమస్య, భూసేకరణ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 777 అప్లికేషన్లు సాదాబైనామావి రాగా, జగిత్యాల జిల్లా బుగ్గారంలో సుమారు 300 దరఖాస్తులు ఇవే ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పైలట్ మండలాల్లో సుమారు 500 చొప్పున సాదాబైనామా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. వీటి తర్వాత అత్యధికంగా పీవోటీ, సక్సేషన్, సివిల్ వివాదాలు, అసైన్డ్ ల్యాండ్ కేటాయింపు కోసం వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి.
త్వరిగతిన పరిష్కారం..
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి చట్టంలో అవకాశం ఉన్నప్పటికీ.. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వెంటనే పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడింది. ఇవి మినహా మిగతా దరఖాస్తులన్నింటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ఆఫీసర్లు కృషి చేస్తున్నారు. సైదాపూర్ మండలంలో వచ్చిన 1798 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు సుమారు 400కుపైగా పరిష్కరించగా.. మరో 300 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిసింది. ఎలిగేడు మండలంలో 1281 అప్లికేషన్లు రాగా 150 పరిష్కరించగా, 310 ఎంక్వైరీ పూర్తయ్యాయి. బుగ్గారం మండలంలో 844 దరఖాస్తులు రాగా, 510 దరఖాస్తుల ఎంక్వయిరీ పూర్తయింది. రుద్రంగి మండలంలో అందిన 1253 అప్లికేషన్లలో కేవలం 31 దరఖాస్తులను మాత్రమే ఎంక్వైరీ పూర్తి చేశారు.