వివాదాలకు కేరాఫ్ .. డీఈవో ఎట్టకేలకు ప్రభుత్వానికి సరెండర్

వివాదాలకు కేరాఫ్ .. డీఈవో ఎట్టకేలకు ప్రభుత్వానికి సరెండర్
  • ప్రశ్నించే యూనియన్ లీడర్లపై కక్ష సాధింపులు 
  •  పెద్దల అండతో గతంలో వేసిన రెండు ఎంక్వైరీ లు పెండింగ్ లోనే
  •  తాజాగా మహిళా కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన కరీంనగర్‌‌‌‌వాసి
  •  బై, జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా కరీంనగర్ ను వదలని డీఈఓ జనార్దన్ రావు

కరీంనగర్, వెలుగు: మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ డీఈఓ  జనార్ధన్ రావును కలెక్టర్ పమేలా సత్పతి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేశారు.  ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నా.. కలెక్టరేట్ ఎదుట చాలా మంది  ధర్నాలు చేసినా ఆయన్ని కొందరు ఉన్నతాధికారులు ఇప్పటివరకు  కాపాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  తాజాగా డీఈఓ జనార్ధన్ రావుపై చర్యలు తీసుకోవడంతో ఆయన ఐదేళ్లలో చేసిన అక్రమాలు, కక్షసాధింపు చర్యలను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏకరువు పెడుతున్నారు. 

మాజీ డీఈఓపై మహిళా కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు

మాజీ డీఈఓ జనార్దన్ రావు కామెంట్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయని టీచర్లు మండిపడుతుండగా.. కరీంనగర్ కు చెందిన సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్‌‌‌‌ డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మహిళా కమిషన్‌‌‌‌కు ఎక్స్  వేదికగా ఫిర్యాదు చేశారు. డీఈఓను రాష్ట్ర విద్యాశాఖకు కలెక్టర్ సరెండర్ చేయడం హర్షణీయమని డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ ప్రకటించింది.

  డీఈఓ గత ఐదేళ్లలో అవగాహనలేమి , మూర్ఖపు చర్యలు, పాలనా వైఫల్యాలతో మొత్తం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించడమేగాక టీచర్లను తన భాషతో మానసిక క్షోభకు గురి చేశారని డీటీఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి గుర్తు చేశారు.  డీఈఓపై చర్యలు తీసుకోవాలని స్టేట్‌‌‌‌ టీచర్స్‌‌‌‌యూనియన్‌‌‌‌(ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇన్నాళ్లు కొందరు ఆఫీసర్లే ఆయనను కాపాడుతూ వచ్చారని, ఇప్పుడు కూడా రికార్డెడ్ గా దొరికిపోవడం వల్లే వేటు వేశారని, లేదంటే ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా కాపాడేవారనే విమర్శిస్తున్నారు. 

ఎన్ని ఆరోపణలు వచ్చినా కరీంనగర్ ను వదల్లే.. 
    

  • డీఈఓగా జనార్దన్ రావు పని చేసిన ఐదేళ్లలో అనేక ఆరోపణలు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. 
  • అవసరం లేకున్నా వివిధ స్కూళ్ల నుంచి నాన్ టీచింగ్ సిబ్బందిని 30 మంది వరకు డిప్యూటేషన్ పై డీఈఓ ఆఫీసుకు ట్రాన్స్ ఫర్ చేయడం, టెన్త్ వాల్యూయేషన్ లో  పీడీలకు డ్యూటీ అవసరం లేకున్నా డ్యూటీలు వేయడం వివాదాస్పదంగా మారింది.  
  • టెన్త్ క్లాస్ స్పాట్ వ్యాల్యూయేషన్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండయిన ముగ్గురు టీచర్లలో ఇద్దరికి పాత స్కూళ్లలోనే  పోస్టింగ్ ఇచ్చి, మరో దళిత టీచర్ కు మాత్రం దూరంగా వీణవంక మండలానికి ట్రాన్స్ ఫర్  చేయడంపై విమర్శలు వచ్చాయి.
  • ఐటీ రిటర్న్స్ కోసం డీఈఓ జనార్దన్ రావు సమర్పించిన ఇంటి కిరాయి బిల్లులపైనా అనుమానాలు ఉన్నాయి. ఆయన ఒక ఇంట్లో ఉంటూ మరొకరి ఇంటి పేరుపై బిల్లులు చెల్లించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.    
  • జనార్దన్ రావు డీఈఓగా ఉండగానే హుజురాబాద్ బై ఎలక్షన్, తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, 2023లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్, ఇటీవల టీచర్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నియామవళి ప్రకారం జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు.  కానీ ఈయన మాత్రం కరీంనగర్ నుంచి కదల్లేదు. 
  • హుజురాబాద్‌‌‌‌ బై ఎలక్షన్ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని టీచర్లకు ఆదేశాలివ్వడం, రూట్‌‌‌‌బాధ్యతలను టీచర్లకు అప్పగించడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. 
  • జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మెమోలు ఇచ్చిన డీఈవోగా జనార్దన్ రావుకు పేరుంది. తనను ప్రశ్నించిన  యూనియన్‌‌‌‌ నాయకులకు ఇంక్రిమెంట్లలో  కోత  విధించారనే విమర్శలు ఉన్నాయి. 
  • 317 జీవో సమయంలోనూ సీనియర్లను ఇతర జిల్లాలకు పంపి, కొందరు జూనియర్లకు కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.  

    
కరీంనగర్ డీఈఓగా మొండయ్య..
    
డీఈఓ జనార్దన్‌‌‌‌రావును ప్రభుత్వానికి సరెండర్ చేయడంతోపాటు కరీంనగర్‌‌‌‌ డైట్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌మొండయ్యను కొత్త డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  దీంతో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సిరిసిల్ల  డీఈఓగా జనార్దన్ రావు వ్యవహరించారు. ఆయన స్థానంలో కామారెడ్డి డీఈవో ఎస్‌‌‌‌.రాజుకు అదనపు బాధ్యతలు 
అప్పగించారు.