కరీంనగర్, వెలుగు: మహిళలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వడ్డీ లేని రుణాలకు వడ్డీ పైసలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం మహిళల మిత్తి పైసల కోసమే రూ.304 కోట్లు రిలీజ్ చేసిందని, అందులో కరీంనగర్ నియోజకవర్గానికి రూ.కోటి 20 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో నియోజకవర్గంలోని మహిళా సంఘ సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులకు సంబంధించిన రూ.1.20 కోట్ల చెక్కును సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అందజేశారు.
మహిళల అభ్యున్నతికి కృషి
జగిత్యాల టౌన్/రాయికల్, వెలుగు: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
నియోజకవర్గంలోని 2,434 స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.12 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, డీఆర్డీవో రఘువరన్, అధికారులు పాల్గొన్నారు. రాయికల్ మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు.
ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేస్తుందన్నారు. అనంతరం అల్లీపూర్, రాయికల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ లెటర్లు అందజేశారు.
