
రక్షిత్ శెట్టి777 చార్లీ సినిమాని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. కుక్కపిల్ల స్టోరీతో తీసిన ఈ సినిమాని చూసిన అనంతరం ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తు వచ్చినట్లు బొమ్మై తెలిపారు. సినిమా చాలా బాగుందని, కచ్చితంగా అందరూ చూడాలని అన్నారు. గతంలో కూడా కుక్కలపై సినిమాలు వచ్చాయని, కానీ ఈ సినిమాలో వాటి మనోభావాలను గొప్పగా చూపించినట్లు బొమ్మై తెలిపారు. కుక్కలు తమ మనోభావాలను కళ్ల ద్వారా వ్యక్తం చేస్తాయని, శునకాలకు ప్రేమ అపరిమితంగా ఉంటుందని వెల్లడించారు. కాగా బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు స్నూబీ చనిపోయింది. అటు చార్లీ జూన్ 10న ఐదు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. కె కిరణ్రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రక్షిత్ శెట్టి, జిఎస్ గుప్తా కలిసి సంయుక్తంగా నిర్మించారు. సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషించారు.