తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు

తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సమయంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. చినస్వామి స్టేడియంలో చేసిన ఈవెంట్కు సంబంధించి ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. స్టేడియం దగ్గర అంబులెన్స్‌లు ఎందుకు లేవని నిలదీసింది. తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటో కేసు రిజిస్టర్ చేసింది.

ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మూడు విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. తొక్కిసలాటకు కారణాలు, ఈ విషాదాన్ని ఎందుకు నిలువరించలేకపోయారనే విషయంలో వివరణ, భవిష్యత్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు.. ఈ మూడు విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తొక్కిసలాట ఘటనపై విచారణను కర్ణాటక హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందించారు.

18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు మంగళవారం రాత్రి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నంబర్ 3కు తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.