కార్తీకమాసం  నెల రోజులు ఎంతో పవిత్రమనవి.   ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును ( 2025 నవంబర్ 5) అత్యంత విశిష్టమైనది. ఆ రోజున ప్రత్యేకంగా  పూజలు, నోములు ఆచరిస్తారు. దాదాపుగా హిందువులు అందరూ 365 వత్తులు వెలిగిస్తారు.  ఈ ఏడాది ( 2025) కార్తీకపౌర్ణమి రోజున వత్తులు వెలిగించేందుకు శుభముహూర్తం.. ఎలా వెలిగించాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కార్తీక మాసానికి హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్ర స్థానం ఉంది. ఈ నెల రోజులు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే అపారమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. శివాలయాలలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.
కార్తీక పౌర్ణమి తిథి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. ఇది నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం నవంబర్ 5నే ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ రోజునే ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి శివార్చన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం దక్కుతుంది.
కార్తీక పౌర్ణమి ( నవంబర్ 5) పూజా సమయాలు
- నదీ స్నానం (బ్రహ్మ ముహూర్తం)నవంబర్ 5 : ఉదయం 4:52 నుంచి 5:44 వరకు
 - నవంబర్ 5 న పూజా సమయం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు
 - నవంబర్ 5 సాయంత్రం దీపారాధన (365 వత్తులు)...
 - ఉసిరి దీపం : సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు
 
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే, 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఉపవాసం ఉండి ఈ దీపారాధన చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.
దీపారాధన చేసేటప్పుడు కొన్ని పాటించాల్సిన నియమాలు
వెలిగించే విధానం : అగ్గిపుల్ల, కొవ్వొత్తి వాడకూడదు. అగరబత్తితో మాత్రమే వత్తులను వెలిగించాలి. 
ముందుగా గుత్తగా 365 వత్తులను ఆవునెయ్యిలో ముందుగా నానబెట్టాలి.  ఆ తరువాత వెడల్పాటి ప్రమిదలో ఆవునెయ్యి కొద్దిగా పోసి అందులో ఈ వత్తులను స్థంభం వలె నిలబెట్టాలి.  తరువాత అగర్ బత్తీని వెలిగించి.. దానితో 365 వత్తులకు దీపారాధన చేయాలి.  తరువాత మళ్లీ కొద్దిగా నెయ్యి వేయాలి.  తరువాత ఆ దీపారాధనలోనే కుటుంబ సభ్యులు అందరూ కొద్దిగా ( 2,3 చుక్కలు) నెయ్యి వేయాలి  తరువాత పసపు.. కుంకుమ.. అక్షింతలు  దీపారాధన స్వరూపంలో ఉన్న కార్తీక దామోదరుని  సమర్పించాలి. 
ఎవరు చేయాలి: ఇంటి యజమాని స్వయంగా ఈ దీపారాధన చేస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. యజమాని చేసేటప్పుడు భార్య.. పిల్లలు.. ఆయన చేయిని పట్టుకోవాలి. లేదంటే ఆయనకు వెలిగించే సమయంలో ఆయనకు తగిలినా సరిపోతుంది.
మంత్రం: వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ ...దామోదరం ఆవాహయామి... త్రయంబకం ఆవాహయామి.... అని ఉచ్చరించాలి.
పసుపు.. కుంకుమ,,గంధం అక్షింతలు సమర్పించాలి.
శివుని అష్టోత్తరం.. లింగాష్టకం.. పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.
తరువాత అగర్ బత్తీలు వెలిగించి... నైవేద్యం సమర్పించి.. హారతి ఇవ్వాలి. 
ఈ నియమాలతో కార్తీక పౌర్ణమిని ఆచరిస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
