
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: రోడ్ల పై చెత్త వేస్తే రూ.10 వేలు జరిమానా తప్పదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. మంగళవారం క్షేత్రస్థాయి శానిటేషన్ పర్యటనలో భాగంగా ఏనుగులగడ్డ ప్రాంతంలో టీ షాపు నిర్వాహకుడు వాడిన టీ కప్పులతోపాటు చెత్తను రోడ్డుపై వేయడంతో ఆగ్రహించిన కమిషనర్ షాపు నిర్వాహకుడికి రూ.10 వేలు ఫెనాల్టీ విధించారు.
నగర పరిధిలోని షాపు నిర్వాహకులు వారి దుకాణాల నుంచి వచ్చే చెత్తను కార్పొరేషన్ నుంచి వచ్చే చెత్త తరలింపు వాహనాలకు, స్వచ్ఛ ఆటోలకు అందించాలని సూచించారు. బల్దియా నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా నగర వాసులు, వివిధ దుకాణదారులు బల్దియాకు సహకరించాలని కోరారు.