- లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదు
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
- అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ పెట్టి దేశమంతా తిరుగుతున్నరు
- అందులో చేరుతున్న వారంతా ఔట్డేటెడ్ నేతలేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా లెక్కనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో డబ్బు కోసం ఎమ్మెల్సీ కవితతో కేజ్రీవాల్ మాట్లాడి రూ.150 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని, ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం జరిగిందని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్కే లిక్కర్ స్కాం పరిమితం చేయకుండా దేశమంతా విస్తరించాలని ప్రయత్నించారన్నారు. సిసోడియా ఎలాగైతే జైలుకెళ్లారో.. అతి త్వరలోనే కవిత కూడా జైలుకు వెళ్తారన్నారు. ఈ కేసులో మరింత మందిని రానున్న రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశముందన్నారు.
తెలంగాణ ఖజానాను
దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్
తెలంగాణలో కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ పెట్టారని వివేక్ చెప్పారు. రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆ పార్టీలో చేరుతున్న వారంతా ఔట్ డేటెడ్ నేతలేనన్నారు. దేశంలోనే అత్యంత రిచ్పార్టీ బీఆర్ఎస్ అని, పార్టీ ఫండ్స్ నుంచి రూ.400 కోట్లు ఖర్చు చేసి విమానం కొన్నారని చెప్పారు. తెలంగాణ ఖజానాను దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మేఘా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికులను చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ఏడాది బడ్జెట్లో అందరికీ ప్రయోజనం కలిగేలా కేటాయింపులు చేశారని చెప్పారు. ఉద్యోగ కల్పన, ఆయుష్మాన్ భారత్కు ఇంపార్టెన్స్ ఇచ్చారన్నారు. పేదల ఇండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రూ.10 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. రైల్వే లైన్లు, నేషనల్ హైవేస్కు ఎక్కువ నిధులు కేటాయించారని వివేక్ చెప్పారు.