- లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ
- స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు
- తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి
- శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు, విచారణ
- సాయంత్రం 5:20 గంటలకు అరెస్టు చేస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు.. అక్కడ సోదాలు జరిపారు. అదే టైమ్ లో కవితను విచారించారు. అనంతరం సాయంత్రం 5:20 గంటలకు ఆమెను అరెస్టు చేస్టున్నట్టు ప్రకటించారు. కవితను అరెస్టు చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్ కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో వివరిస్తూ 14 పేజీల నోట్ను కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్ట్ విషయాన్ని మండలి చైర్మన్కు కూడా తెలియజేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్పోర్ట్ వరకు ఎస్కార్ట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు. దీంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి. రాత్రి 7:30 గంటల టైమ్లో కవితను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు.
ఆమె భర్త అనిల్ కూడా ఢిల్లీకి వచ్చేందుకు ఈడీ అధికారులు అనుమతించారు. కాగా, పీఎంఎల్ఏ-–2002లోని సెక్షన్ 3, సెక్షన్ 4 కింద కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా ఆమె ఇంట్లో 5 మొబైల్స్ సీజ్ చేశారు.
మూడు గంటలు విచారణ
ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ఆధ్వర్యంలోని టీమ్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకుంది. ఈ టీమ్లో 10 మంది అధికారులుండగా, వారిలో ము గ్గురు మహిళా ఆఫీసర్లున్నారు. వాళ్లు వచ్చిన టైమ్ లో ఇంట్లో కవిత, ఆమె భర్త అనిల్, పిల్లలు, సిబ్బంది ఉన్నారు. ఈడీ అధికారులు మొదట సోదాలు ప్రారంభించారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో 3గంటల పాటు కవితను విచారించారు. బీఆర్ఎస్ నేత, లాయర్ సోమ భరత్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఈడీ అధికారులు ఆయన్ను అనుమతించలేదు.
కవిత భావోద్వేగం..
ఈడీ అధికారులు రాత్రి 7 గంటలకు కవితను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్, హరీశ్, ఇతర నేతలు వచ్చారు. భర్త, పిల్లలను దగ్గరకు తీసుకుని కవిత భావోద్వేగానికి గురైంది. కార్యకర్తలు నినాదాలు చేస్తూ కవిత ప్రయాణిస్తున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేసి రూట్ క్లియర్ చేశారు. రాత్రి 7:30 గంటలకు కవిత ఇంటి నుంచి వాహనాలు ఎయిర్పోర్టుకు బయల్దేరాయి. ఓ వాహనంలో కవిత ముందు సీటులో కూర్చోగా.. ఈడీ, పోలీస్ విభాగానికి చెందిన మహిళా ఆఫీసర్లు వెనుక కూర్చున్నారు. రాత్రి 8 గంటలకు వాహనాలు ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. 8:30 గంటల తర్వాత స్పెషల్ ఫ్లైట్లో కవిత సహా ఈడీ అధికారులు ఢిల్లీకి బయల్దేరారు.
ఇయ్యాల జడ్జి ముందు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: కవితను హైదరాబాద్లో అరెస్టు చేసిన ఈడీ.. ఆమెను స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొ చ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ కు చేరు కుంది. కవితకు రాత్రి అక్కడే బస ఏర్పాటు చేసింది. ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ విధించారు. కాగా, కవి తను శనివారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కవిత అరెస్ట్ను ఆమె లాయర్ మోహిత్ రావు ఖండించారు.
రాత్రి వరకు హైడ్రామా..
కవిత ఇంటికి మధ్యాహ్నం ఈడీ బృందం వచ్చిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అయితే కవితను అరెస్ట్ చేసినట్టు తెలియడంతో కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సాయంత్రం 6 గంటలకు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు.
బీజేపీ, ప్రధాని మోదీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్, హరీశ్ అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంటి గేటు వద్ద వాళ్లు లొల్లి చేశారు. చివరకు గేటును తోసుకుని లోపలికి చొచ్చుకుపోయారు. లోపల కేటీఆర్కు, ఈడీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కేటీఆర్ మీడియాకు విడుదల చేశారు. సోదాలు, విచారణ పూర్తయిన తర్వాత కూడా తమను లోపలికి ఎందుకు రానివ్వడం లేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఈ క్రమంలో కేటీఆర్ కు అధికారులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అరెస్ట్కు అవసరమైన అన్ని వారెంట్లు చూపించారు. దీంతో కేటీఆర్, హరీశ్సైలెంట్ అయిపోయారు. ఇద్దరు నేతలు కవితను కలిసి ధైర్యం చెప్పారు.
ఎప్పుడేం జరిగిందంటే?
శుక్రవారం మధ్యాహ్నం 1:40 గంటలకు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని ఢిల్లీ ఈడీ బృందం కవిత ఇంటికి చేరుకుంది. ఈ బృందంలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ఈడీ విచారణ, సోదాలకు అంగీకరిస్తూ కవిత సంతకం చేశారు.
1:45 గంటలు: సోదాలు ప్రారంభం
5:20: కవితను అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్కు రాతపూర్వకంగా సమాచారం.
6:30: కవిత వాంగ్మూలం రికార్డ్
6:45: సోదాలు ముగింపు
7:00: ఇంట్లో నుంచి కవితను తీసుకుని బయటకొచ్చిన ఈడీ ఆఫీసర్లు
7:30: ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు కవిత తరలింపు
8:10: ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఈడీ వాహనాలు
చట్టపరంగాఎదుర్కొంటం: కవిత
ఈడీ అరెస్ట్ అక్రమమని, ఈ కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం. చట్టంపై నమ్మకం ఉంచి దొంగ కేసులను, రాజకీయ కక్షసాధింపు చర్యలను ఎదుర్కొంటాం. పార్టీ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.