
- ఎన్కౌంటర్లో నంబాల చనిపోతే కనీస మానవత్వం చూపలేదు: కవిత
మంచిర్యాల, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోతే కనీస మానవత్వం కూడా చూపలేదని ఫైర్ అయ్యారు. అంతిమ సంస్కారాలకు అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా కుటుంబసభ్యులకు చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కూడా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ మునీర్ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా.. ఆయన కుటుంబసభ్యులను కవిత శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ కగార్ను ఆపాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజాస్వామికవాదులు పదేపదే కోరినప్పటికీ బీజేపీ సర్కార్ వినిపించుకోకుండా మారణకాండ సృష్టించింది.
ఆపరేషన్ కగార్లో చనిపోయిన మావోయిస్టుల డెడ్బాడీలను కూడా కుటుంబసభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని అన్నారు. ‘‘సీనియర్జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ మునీర్ మృతి తీరని లోటు. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, విప్లవ ఉద్యమాల భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో మునీర్ కీలకంగా వ్యవహరించారు. స్థానికంగా, దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ఆయన ముందుండేవారు. తన భావజాలం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు’’ అని కొనియాడారు.