
- ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే!
- బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వపై డెసిషన్స్ వాళ్లే తీసుకున్నరు: కేసీఆర్
- టెక్నికల్ అంశాలతో నాకు సంబంధం లేదు
- కాళేశ్వరం నిర్మాణంపైనే మేం నిర్ణయం తీసుకున్నం
- ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దానికీ కేబినెట్ ఆమోదం ఉన్నదని వెల్లడి
- ‘విట్నెస్ 115’గా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు
- ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు అనుమతి.. వన్ టు వన్గా కొనసాగిన ఎంక్వైరీ
- కాళేశ్వరంపై పీపీటీని కమిషన్కు అందజేసిన బీఆర్ఎస్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల లొకేషన్ల మార్పు, బ్యారేజీలలో నీళ్లు నింపడం సహా ఇతర టెక్నికల్ అంశాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారని కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. కాళేశ్వరం నిర్మించాలని ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, దీనికి సంబంధించి ప్రతి నిర్ణయానికీ కేబినెట్ ఆమోదం ఉన్నదని.. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఇంజనీర్ల బాధ్యత అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపాలని తాను ఎవరినీ ఆదేశించలేదని, అది పూర్తిగా సాంకేతికపరమైన అంశమైనందున ఇంజనీర్లు చూసుకుంటారని అన్నట్టు తెలిసింది.
‘‘బ్యారేజీలు, పంప్హౌస్లలో ఏ లెవెల్లో ఎన్ని నీళ్లుంటాయి? ఎంత స్టోర్చేయాలి? ఎన్ని ఎత్తిపోయాలనేది ఇంజనీర్లే చూసుకుంటారు. ఇందులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం ‘విట్నెస్115’గా కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో కాకుండా.. కేసీఆర్ను కమిషన్చైర్మన్పీసీ ఘోష్ వన్టు వన్ విచారణ చేశారు. ఈ సందర్భంగా కమిషన్అడిగిన ప్రశ్నలకు కేసీఆర్సావధానంగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి.. దాని నిర్మాణంపై తామే నిర్ణయం తీసుకున్నామని, కానీ ప్రాజెక్టులో టెక్నికల్ అంశాలన్నింటిపైనా వందకు వందశాతం ఇంజినీర్లే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వెల్లడించినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇవీ..
- కమిషన్: బ్యారేజీల లొకేషన్ల మార్పు నిర్ణయం ఎవరిది?
- కేసీఆర్: బ్యారేజీల లొకేషన్ల మార్పు పూర్తిగా టెక్నికల్ అంశం. అది కూడా ఇంజనీర్లే చూసుకుంటారు. టెక్నికల్ రిపోర్టులు, వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా బ్యారేజీల స్థలాలు మార్చారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ నిర్ణయాలేవీ ఉండవు.
- కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ను ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది?
- కేసీఆర్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నీళ్ల కోసం కొత్త ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికి నిధుల కొరత ఉండడంతో రుణ సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆదాయం సమకూరేదాకా.. రుణాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. వాస్తవానికి రుణాలు ఇచ్చిన సంస్థలు కూడా ప్రభుత్వ పూచీకత్తు కోసం అడిగాయి. అందువల్లే ఆ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది.
- కమిషన్: కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ఆమోదం ఉందా?
- కేసీఆర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి విషయానికీ కేబినెట్ ఆమోదం ఉంది. ప్రతి అంశాన్నీ కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపాం.
- కమిషన్: 2017 డిసెంబర్9న ప్రాజెక్టుపై రివ్యూ మీటింగ్జరిగింది కదా.. ఆ మీటింగ్మినిట్స్ఉన్నాయా?
- కేసీఆర్: మీటింగ్మినిట్స్లో అన్ని అంశాలు ఉన్నాయి. అందులో పేర్కొన్నవన్నీ నిజమే. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలన్నింటినీ సంబంధిత శాఖ అధికారులే చూసుకున్నారు. ప్రాజెక్ట్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయాక.. ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్(ఓఅండ్ ఎం) కోసం 2020 డిసెంబర్28న జీవో 45ను జారీ చేశాం. అందుకు రూ.280 కోట్లు విడుదల చేశాం. బ్యారేజీల నిర్మాణం తర్వాత ఓఅండ్ ఎంను పక్కాగా చేశాం. బ్యారేజీ వద్ద ఈఈ స్థాయి అధికారిని నియమించాం.
- కమిషన్: కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయా? ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది?
- కేసీఆర్: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. ప్రాజెక్టు కోసం 11 క్లియరెన్సులను కేంద్రం నుంచి తీసుకున్నాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్కమిషన్ చెప్పింది. దీంతో వ్యాప్కోస్, సీడబ్ల్యూసీ సూచనల మేరకే నీటి సోర్సును మేడిగడ్డకు మార్చాం. బ్యారేజీని షిఫ్ట్ చేయడానికి ముందు మూడు బ్యారేజీల స్థలాల్లో ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా లైడార్సర్వే చేశాం. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రధానికి నేనే స్వయంగా లేఖ రాశాను. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. 148 మీటర్లకే ఒప్పుకుంటామని స్పష్టం చేసింది. దాంతో పాటు మహారాష్ట్రవైపు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉండడంతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ముందుకు సాగలేదు. ఇక, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఓపెన్కెనాల్నిర్మాణానికి సంబంధించి.. అక్కడ బొగ్గు బ్లాకులు ఉండడంతో సాధ్యపడలేదు. దీంతోపాటు సీడబ్ల్యూసీ సర్వేల మేరకు మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు తేలింది. ఆ నీటి నుంచి 230 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉంటుందని మా ప్రభుత్వం భావించి మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది.
50 నిమిషాలు..18 ప్రశ్నలు
కోర్టు హాల్లో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, కేసీఆర్, కమిషన్సెక్రటరీ, ఇద్దరు నోడల్అధికారులు మాత్రమే విచారణ సందర్భంగా హాల్లో ఉన్నారు. 11:58 గంటలకు కేసీఆర్ విచారణ హాల్లోకి వెళ్లారు. అనంతరం కమిషన్ చైర్మన్మధ్యాహ్నం 12:02 గంటలకు హాల్లోకి వెళ్లి విచారణ ప్రారంభించారు. దేవుడి మీద ప్రమాణంతో ప్రారంభమైన కేసీఆర్ విచారణ.. 12:52 గంటల వరకు సాగింది. మొత్తంగా 50 నిమిషాల పాటు సాగిన విచారణలో కేసీఆర్కు కమిషన్18 ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. విచారణ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు డాక్యుమెంట్లను సమర్పించారని సమాచారం. దాంతో పాటు ప్రాజెక్టు పీపీటీనీ కమిషన్కు ఆయన అందించారు. ఇటీవల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పీపీటీలో కొన్ని మార్పులను చేసి కమిషన్కు కేసీఆర్ అందజేసినట్టు సమాచారం.
భవన్ముందు బీఆర్ఎస్ క్యాడర్ హల్చల్..
కేసీఆర్ను బుధవారం ఉదయం ఫామ్హౌస్లో హరీశ్రావు, కేటీఆర్, కవిత సహా మాజీ మంత్రులు, పలువురు నేతలు కలిశారు. అక్కడి నుంచి అందరూ కమిషన్ విచారణకు బయల్దేరారు. అయితే ఒక్క కవిత మినహా మిగతా నేతలంతా బీఆర్కే భవన్కు వచ్చారు. బీఆర్ఎస్ పెద్దల పిలుపు మేరకు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కేసీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా, కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ చుట్టుపక్కల భారీ పోలీస్బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్కే భవన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట పరిస్థితి ఏర్పడింది. ఇక కేసీఆర్తో పాటు కేవలం 9 మందినే లోపలికి పోలీసులు అనుమతించారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహమూద్అలీని మాత్రమే లోపలికి పంపించారు. వాస్తవానికి తొలుత పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు లిస్టులో ఉండగా.. ఆయన బుధవారం ఉదయం కిందపడడంతో కాలికి గాయమై ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో సంతోష్ను లోపలికి పంపించారు.
వన్ టు వన్ విచారణ..
కేసీఆర్ విచారణ మొత్తం వన్టు వన్ సాగింది. ముందు ఓపెన్ కోర్టులోనే విచారించాలని కమిషన్ అనుకున్నప్పటికీ.. తన ఆరోగ్యం బాగాలేదని కమిషన్కు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. అంతమంది ముందు ఓపెన్కోర్టులో విచారణ చేస్తే ఇబ్బంది అవుతుందని, వన్టు వన్ చేయాలని కోరినట్టు సమాచారం. దీంతో అప్పటిదాకా కోర్టు హాల్లో ఓపెన్ కోర్టు కోసం వేచి చూస్తున్న జర్నలిస్టులు, అధికారులను.. కమిషన్ వర్గాలు బయటకు పంపించాయి. ఓపెన్ కోర్టు ఉండదని, ఇన్సైడ్ విచారణ అని కమిషన్అధికారులు చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. కాగా, చట్టంలోని నిబంధనల ఆధారంగా కేసీఆర్కు కమిషన్ముఖాముఖి వెసులుబాటును కల్పించినట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.