
- కూరగాయలు సాగు చేస్తూ మార్కులు పొందుతున్న ‘ఒద్యారం’ స్టూడెంట్స్
- విటమిన్ గార్డెన్లో పండించిన కూరగాయాలతోనే మిడ్ డే మీల్స్కు కూరలు
- చల్లూరు బడి పిల్లల న్యూస్ చానల్లో ఊరి ముచ్చట్లు
- చల్లూరు స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా అమలుకు శ్రీకారం
కరీంనగర్/గంగాధర, వెలుగు: స్కూళ్లలో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్, హ్యాండ్ రైటింగ్, ల్యాబ్ వర్క్ కంప్లీట్ చేస్తేనే ఫార్మేటివ్ అసెస్మెంట్లో టీచర్లు మార్కులు వేస్తుంటారు. కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గవర్నమెంట్ స్కూల్లో మాత్రం మొక్కలు పెంచి కూరగాయలు పండించిన విద్యార్థులకు టీచర్లు ఎఫ్ఏ మార్కులు వేస్తూ వారిని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తున్నారు.
8 ఏళ్లుగా ఆ టీచర్లు చేస్తున్న ఈ ప్రయోగం ఆ స్కూల్ను నందనవనంగా మార్చేసింది. విద్యార్థుల కృషి ఫలితంగా ఒద్యారం హైస్కూల్ ఇప్పుడు పచ్చని చెట్లు.. రమణీయమైన పూలమొక్కలు.. ఆకర్షించే క్రోటాన్, కొబ్బరి, అశోక, టేకు వనాలు.. పచ్చదనంతో కనువిందు చేస్తోంది. 8 ఏళ్లలో ఈ స్కూల్ లో 400లకు పైగా మొక్కలు నాటడం విశేషం.
సైన్స్లో మార్కులు..
కరీంనగర్ కలెక్టర్గా సర్ఫరాజ్అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు మొక్కల పెంపకం చేపట్టిన విద్యార్థులకు సైన్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్లోని ప్రాజెక్టు విభాగంలో 10 మార్కులు కేటాయించడం ప్రారంభించారు. ఎఫ్ఏ-1లో 5 మార్కులకు 3 మార్కులు, ఎఫ్ఏ-2లో 5 మార్కులకు 2, ఎఫ్ఏ3లో 5 మార్కులకు 2 మార్కులు, ఎఫ్ఏ-4లో 5 మార్కులకు 3 మార్కులు ఇలా మొత్తం 10 మార్కులు మొక్కలు సంరక్షించిన విద్యార్థులకు వేస్తున్నారు. ఈ పద్ధతిని 8 ఏళ్లుగా కొనసాగిస్తూన్నారు. గతంలో ఈ స్కూల్ రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కూడా అందుకుంది.
స్కూల్లో తీరొక్క చెట్టు
ఒక్కో విద్యార్థి 5 నుంచి 10 మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు. వేప, టేకు, కొబ్బరి, క్రోటాన్, అశోక, మామిడి, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. దీనికితోడు విటమిన్గార్డెన్ పేరుతో సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తున్నారు. ఈ కూరగాయలను మధ్యాహ్న భోజనంలో కూరలు వండేందుకు వినియోగిస్తున్నారు. మునగ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటివి పంటలు సాగుచేస్తున్నారు. ఒద్యారం స్కూల్ లో ప్రారంభమైన ఈ విటమిన్గార్డెన్ విధానం జిల్లాలోని చాలా స్కూళ్లలో ఇప్పుడు అమలవుతోంది.
విద్యార్థుల్లో ఆసక్తి పెంచాం
మొక్కల సంరక్షణపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాం. ప్రస్తుతం వారే వాటి బాగోగులను చూసుకుంటున్నారు. స్కూల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఏదో ఒక మొక్క నాటుతారు. ప్రతి వారం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.- ఏనుగు ప్రభాకర్రావు, హెచ్ఎం
చల్లూరు బడి పిల్లల ఛానల్ లో ఊరి ముచ్చట్లు..
వీణవంక మండలం చల్లూరు హైస్కూల్ విద్యార్థులు నడుపుతున్న యూట్యూబ్ చానల్లో ‘చల్లూరు టాక్స్’ పేరిట విద్యార్థులు చెప్తున్న ఊరి ముచ్చట్లు, బడి సంగతులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులే రిపోర్టర్లుగా, కెమెరామన్ గా, వీడియో ఎడిటర్లుగా మారి ఓ న్యూస్ బులిటెన్ రన్ చేస్తున్నారు. విద్యార్థుల్లో కమ్యూనిషన్ స్కిల్స్ పెంచడంతో పాటు.. వారికి సమాచార సేకరణలో అవగాహన కల్పించడం, రీడింగ్, రైటింగ్ ఎబిలిటీస్ పెంచడమే లక్ష్యంగా పాఠశాలలో ఇది ప్రతి నెలా ఒక బులిటెన్ తయారు చేసి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు.
పిల్లల్లో ఇంగ్లిష్ మాట్లాడడంలో ఉన్న భయాన్ని పొగొట్టేందుకు జర్నలిజాన్ని ఒక టూల్ గా ఎంచుకున్నారు. ఊరిలో జరిగిన సంగతులతోపాటు స్కూళ్లో జరిగిన వివిధ కార్యక్రమాలను వార్తలుగా మలుస్తున్నారు. స్కూల్ పిల్లలు లేదంటే టీచర్లు సెల్ ఫోన్ తో వాటిని రికార్డు చేసి, ఫోన్లోనే ఎడిట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లల న్యూస్ చానల్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని హెడ్మాస్టర్ సంపత్ రెడ్డి వెల్లడించారు.
ఇక్కడి ‘ఇంగ్లిష్ క్లబ్’ ఇక జిల్లావ్యాప్తంగా..
ఇంగ్లిష్ మాట్లాడడంలో ప్రావీణ్యం పెంచుకునేందుకు ఈ స్కూల్లో ఇంగ్లిష్ క్లబ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్లబ్కు పిల్లలే అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, ఇతర విధులు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఇటీవల స్కూల్ను సందర్శించి ఇంగ్లిష్ క్లబ్, యూట్యూబ్ చానల్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. విభిన్న రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న చల్లూరు జడ్పీ హైస్కూల్ ఆదర్శనీయమని, ఇక్కడ ప్రారంభించిన ఇంగ్లీష్ క్లబ్ను జిల్లా వ్యాప్తంగా అమలుచేస్తామని ప్రకటించారు.