మహారాష్ట్ర దళిత నేత అన్నాభావు సాఠే కవిత్వాలు అణగారిన వర్గాల కోసమే అని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన పుట్టిన స్థలానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహారాష్ట్ర దళిత నేత అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాటేగావ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని.. మాట్లాడారు.
రష్యా వంటి దేశం అన్నాభావు సాఠేని గుర్తించిందని, కానీ.. భారతదేశం అన్నాభావు సాఠేని గుర్తించలేదన్నారు సీఎం కేసీఆర్. రష్యా ప్రధాన లైబ్రరీలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఆయన రచనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవన్నారు. అన్నాభావు రచనలు అన్ని భాషాల్లోకి ట్రాన్స్ లేట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నాభావుకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. జై మహారాష్ర్ట, జై భారత్ అంటూ ప్రసంగం ముగించారు.
అంతకుముందు.. కొల్హాపూర్ లోని మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు కేసీఆర్ను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.