
- అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్ ఎలా ఇవ్వాలన్నదానిపై నోట్స్
- ఈసారైనా కేసీఆర్ వస్తారా? రారా? అని పార్టీ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేటీఆర్, హరీశ్రావుతో కేసీఆర్వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని పిటిషన్వేయగా.. వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెడితే అక్కడే తేల్చుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మంగళవారం కూడా హరీశ్రావు, కేటీఆర్తో కేసీఆర్సమావేశమయ్యారు. ప్రభుత్వానికి ఎలా కౌంటర్ ఇవ్వాలన్న దానిపై నేతలు చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేసినా.. కేసీఆర్మాత్రం హాజరు కాలేదు. ఫాంహౌస్లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగి కొన్ని నెలలు ఆయన రెస్ట్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత స్పీకర్ చాంబర్లో ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా కేసీఆర్ప్రమాణం చేశారు. 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. కేవలం ఒక్కరోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
ఇప్పుడు అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు, అందులోని అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా ఏర్పాటు చేసిన కమిషన్రిపోర్టుపై చర్చించనున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై ఆసక్తి ఏర్పడింది. అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టుపై కేసీఆర్ సమాధానమిస్తారా.. లేదంటే హరీశ్ రావుతోనే సమాధానం చెప్పిస్తారా? అన్న చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతున్నది. ఈ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరుకాకపోవచ్చన్న చర్చే ఎక్కువగా జరుగుతున్నది.