- వీ6‑వెలుగుపై కేసీఆర్ మీడియా విషం
- పేపర్ వెహికల్లో కుట్టు మిషన్లు అంటూ కట్టుకథ
- హుజూరాబాద్ తీసుకెళ్తున్నారంటూ విషప్రచారం
- బతుకుదెరువు కోసం డ్రైవర్ రవాణా చేసిన సామాన్లకు ఎన్నికలతో లింకు
- ప్రజాదరణను దెబ్బతీసే కుట్రలు.. తప్పుడు వార్తలతో నవ్వులపాలు
నిజామాబాద్ / జగిత్యాల, వెలుగు: ‘వీ6–వెలుగు’పై సీఎం కేసీఆర్ సొంత మీడియా మరోసారి విషం కక్కింది. క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ‘వీ6–వెలుగు’ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కట్టు కథలు అల్లింది. జగిత్యాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్లోడ్తో బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్కు వెళ్లిన హైర్ వెహికల్ తిరిగి సాయంత్రం జగిత్యాలకు వస్తున్న వీడియోలు చూపిస్తూ గురువారం రోజంతా ఫేక్ న్యూస్ ప్రసారం చేసింది. బతుకుదెరువు కోసం ఓ డ్రైవర్తన హైర్ వెహికల్లో జగిత్యాలకు గూడ్స్ సరఫరా చేయడాన్ని హుజూరాబాద్ బైపోల్తో ముడిపెట్టింది. నిజామాబాద్–జగిత్యాల రూట్తో హూజూరాబాద్కు ఏ సంబంధం లేకపోయినా ఈటల రాజేందర్ తరఫున కుట్టుమిషన్లు పంచడానికి తీసుకెళ్తున్నట్లు గులాబీ చానెల్ నిస్సిగ్గుగా తప్పుడు కథనాలను ప్రసారం చేసి పైశాచిక ఆనందం పొందింది.
అసలేం జరిగిందంటే..
జగిత్యాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి నిజామాబాద్ కు ప్రతిరోజూ వెలుగు పేపర్సప్లై చేసేందుకు ఓ మారుతీ ఎకో వ్యాన్ను హైర్ చేసుకున్నారు. ఈ వ్యాన్ డెయిలీ రాత్రి ప్రింట్ అయిన పేపర్తో బయలుదేరి ఉదయం 5 గంటల కల్లా నిజామాబాద్ చేరుకుంటుంది. ఏ పేపర్కైనా ఇలాంటి హైర్ వెహికల్సే నడుస్తాయి. పేపర్ డెలివరీ అయ్యాక ఆ వెహికల్స్కు ప్రెస్ తో ఎలాంటి సంబంధం ఉండదు. రిటర్న్లో వెహికల్స్ డ్రైవర్లు ఖాళీగా రాకుండా ప్యాసింజర్ ను ఎక్కించుకోవడమో, ఏవైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడమో చేస్తారు. వెలుగు పేపర్ ను నిజామాబాద్ తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ సైతం రిటర్న్ లో పెట్రోల్ ఖర్చుల కోసం నిజామాబాద్ లోని హోల్సేల్ షాపుల నుంచి కుట్టుమెషీన్లు, డ్రెస్ మెటీరియల్, ఇతర గూడ్స్ను మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లోని రిటైల్ షాపులకు సప్లై చేసుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం కూడా నిజామాబాద్లోని ఓ హోల్సేల్షాపు నుంచి 22 కుట్టుమెషీన్లు, డ్రెస్మెటీరియల్ తో జగిత్యాలకు వస్తుండగా.. దొంగచాటుగా కొందరు వీడియో తీశారు. నిజామాబాద్–జగిత్యాల రూట్తో హుజూరాబాద్కు ఏ సంబంధం లేకున్నా,
ఆ కుట్టు మెషీన్లను హుజూరాబాద్లో పంచడానికే తీసుకెళ్తున్నట్లు, తామేదో గొప్ప ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కున్నట్లు కట్టుకథ అల్లి గురువారం, పింక్ చానెల్లో బ్రేకింగ్ న్యూస్గా నడిపారు. సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు.
క్రెడిబిలిటీ దెబ్బతీసేందుకే..
నిజాలను నిర్భయంగా చెప్పే ‘వీ6–వెలుగు’కు తెలంగాణ సమాజంలో ఎనలేని ఆదరణ ఉంది. ఈ క్రెడిబిలిటీని దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఎన్నో రకాల కుట్రలు పన్నుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వీ6–వెలుగు పై తప్పుడు కథనాలతో బురద జల్లేందుకు
ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తమ సొంత చానెల్ను, సోషల్ మీడియా విభాగాన్ని అడ్డంగా వాడుకుంటున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలోనూ వీ6–వెలుగు పేరిట ఫేక్ సర్వేలను వైరల్ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నారు. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్కు, బీజేపీకి వ్యతిరేకంగా వీ6–వెలుగు పేరుతో ఫేక్ న్యూస్ క్లిప్పింగులు తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కండువా కప్పినట్లు, తాను తప్పు చేశానని సీఎం కేసీఆర్కు ఈటల రాజేందర్ లెటర్ రాసినట్లు, రెడ్లు, ముస్లింల ఓట్లు తనకు అవసరం లేదని ఈటల చెప్పినట్లు.. వీ6–వెలుగు లో వచ్చినట్లుగా క్లిప్పింగులు తయారుచేసి సర్క్యులేట్ చేశారు. గులాబీ చానెల్, పేపర్ లో చెబితే ఎవరూ నమ్మరు గనుక ‘వీ6–వెలుగు’ క్రెడిబిలిటీని ఇట్ల వాడుకున్నారు. ఈ పాచికలేవీ పారకపోవడంతో ఇప్పుడీ కుట్టు మెషీన్ల డ్రామా తెరపైకి తెచ్చి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.
రెగ్యులర్ ఆర్డర్లో భాగమే
మాకు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద కుట్టు మెషీన్ల షాపు ఉంది. రెగ్యులర్ గా నిజామాబాద్ నుంచి కుట్టు మెషీన్లను ఆర్డర్పై తెప్పిస్తుంటాం. రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఈ మధ్య ప్రైవేట్ వెహికల్స్లో తెప్పిస్తున్నం. నిజామాబాద్ కు ప్రతిరోజూ వెలుగు పేపర్ తీసుకెళ్లే వెహికిల్ రిటర్న్లో జగిత్యాలకు ఖాళీగా వస్తుంది. బుధవారం వచ్చేటప్పుడు కుట్టు మెషీన్లు అందులో తీసుకొచ్చారు. ఇవి మా రెగ్యులర్ ఆర్డర్లో భాగమే.
- వినయ్, జగిత్యాల
పెట్రోల్ ఖర్చుల కోసం గూడ్స్ సప్లై చేసుకుంట..
నేను ‘వీ6 –వెలుగు’ పేపర్ల ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న. తెల్లవారుజామున జగిత్యాల నుంచి నిజామాబాద్కు పేపర్లోడ్తో వెళ్త. రిటర్న్లో పెట్రోల్ ఖర్చుల కోసం లాక్డౌన్కు ముందు ప్రయాణికులను తీసుకెళ్లేటోడిని. లాక్డౌన్ తర్వాత ప్యాసింజర్స్ లేక నిజామాబాద్లోని కేఎంసీ స్టోర్ నుంచి జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల తదితర పట్టణాలకు కుట్టుమిషన్లు, బట్టలు, డ్రెస్మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న. ఎవరో నిన్న వెహికల్ ను వీడియో తీసి హుజూరాబాద్ ఎన్నిలకు సామాన్లు తీసుకెళ్తున్నట్లు తప్పుడు వార్త వైరల్ చేసిన్రు. పొట్ట కూటి కోసం డ్రైవర్గా నేను చేసిన పనిని రాజకీయం చేయడం దారుణం.
‑ నరేందర్, వ్యాన్ డ్రైవర్