‘కేసీఆర్ ఎవరో కోన్ కిస్క.. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మా పార్టీకి లేదు’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది ? ఏం చేస్తోంది ? అనే వివరాలను తెలంగాణ సమాజానికి స్వయంగా ప్రధాని మోడీ వివరించారని చెప్పారు. బీజేపీపై ప్రేమాభిమానాలు చూపుతున్న - తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. విజయవాడకు వెళ్లేందుకు సోమవారం ఉదయం రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
“కేసీఆర్ తొలుత తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు మొహం చూపించే ధైర్యం సీఎంకు లేదు” అని కామెంట్ చేశారు. మోడీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే.. హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలను కేసీఆర్ పెట్టించుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రచారం కోసం టీఆర్ఎస్ ఖర్చు చేసిన డబ్బంతా ప్రజలదేనని ఆరోపించారు. కేసీఆర్పై ఉన్న ప్రజా వ్యతిరేకత నిన్నటి ‘విజయ సంకల్ప సభ’ తో మరోసారి బహిర్గతమైందన్నారు. ప్రధాని మోడీ సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని సంజయ్ చెప్పారు.