
- కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పెద్దల నుంచి పిలుపు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. బుధవారం బీఆర్కే భవన్లో నిర్వహించే ఎంక్వైరీకి అటెండ్ అవుతున్నారు. ఈ మేరకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పెద్దల నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలకు దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కేడర్ను మొబిలైజ్ చేయాల్సిందిగా నేతలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. కాగా, ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్తో హరీశ్ రావు సోమవారం భేటీ అయ్యారు.
కమిషన్ విచారణ పూర్తయిన వెంటనే ఆయన నేరుగా ఫాంహౌస్కు వెళ్లారు. కమిషన్ విచారించిన తీరును కేసీఆర్కు ఆయన వివరించినట్టు తెలిసింది. ఏమేం ప్రశ్నలు అడిగారు.. కమిషన్ చైర్మన్ రెస్పాన్స్ ఎలా ఉంది.. తదితర విషయాలను ఆయన తెలియజేసినట్టు సమాచారం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లొకేషన్ మార్పు, డీపీఆర్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలను కేసీఆర్ దృష్టికి హరీశ్ రావు తీసుకెళ్లినట్టు తెలిసింది.