
- ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వెల్లడి
- రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం
- కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రముఖులు
హైదరాబాద్, వెలుగు: హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో కాసేపు నడిచారు. హాస్పిటల్లోని తన రూమ్లో వాకర్తో కేసీఆర్ నడుస్తున్న 1.43 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఈ మేరకు రిలీజ్ చేశారు. గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు కుటుంబ సభ్యులు తరలించారు.
సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు.. తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. శనివారం మధ్యాహ్నం డాక్టర్ ప్రవీణ్రావు పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడిచారు. డాక్టర్లు వాకర్ను ముందుకు జరుపుతూ కేసీఆర్తో జాగ్రత్తగా అడుగులు వేయించారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘మొబిలైజేషన్ స్టార్ట్’ చేస్తారని, ఇందులో భాగంగానే కేసీఆర్ను నడిపించే ప్రయత్నం చేశామని డాక్టర్లు తెలిపారు.
హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ప్రవీణ్రావు చెప్పారు. కేసీఆర్ మానసికంగా బలంగా ఉన్నారని, ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేగంగా రికవర్ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తామని, ఆయన మెడికల్గా స్టేబుల్గా ఉన్నారని, నార్మల్ఫుడ్ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే రెండు, మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
కేటీఆర్కు అఖిలేశ్ యాదవ్ ఫోన్
కేసీఆర్ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరా తీశారు. శనివారం మంత్రి కేటీఆర్కు ఆయన ఫోన్చేసి ‘కేసీఆర్ ఎలా ఉన్నారు?.. ప్రమాదం ఎలా జరిగింది? ఆపరేషన్తర్వాత పరిస్థితి ఏమిటి?’’ అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం యశోద హాస్పిటల్కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్, ఎంపీ సంతోష్తో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు శనివారం కేటీఆర్కు లేఖ రాశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డానని, ఆయన కోలుకొని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని ఆకాంక్షించారు.
కేసీఆర్కు చిన్నజీయర్ పరామర్శ
హైదరాబాద్, వెలుగు: తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం రాత్రి చిన్నజీయర్ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాదాపుగా రెండేళ్లుగా చిన్న జీయర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్లో కిందపడి హాస్పిటల్లో చేరడంతో జీయర్ స్వయంగా హాస్పిటల్కు వచ్చి పరామర్శించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా
కేసీఆర్ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్తమిళి సై ఆరా తీశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం జరగ్గా.. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రతినిధిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్రావుతో గవర్నర్ మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత ఎలా ఉన్నారనే వివరాలు అడిగారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.