
కీసర,వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో సంబంధిత అధికారులు, ఆలయ కమిటీలతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి4 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయన్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనంతో పాటు వీవీఐపీ, వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ కమిటీ కీసర గుట్టపై, దిగువన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ట్రాఫిక్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా ప్రాంతాల నుంచి గుట్టకు వచ్చిన భక్తులకు ట్రాన్స్ పోర్టు కల్పించే అంశాలను నిరంతరం పరిశీలించాలన్నారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ..6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని.. పోలీసులు ఎప్పుడు అలర్ట్గా ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు నర్సింహారెడ్డి, శాంసన్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ లింగ్యానాయక్, ఆలయ ఈవో కె. సుధాకర్ రెడ్డి, ధర్తకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.